Telugu Global
NEWS

టిడ్కో ఎన్టీఆర్ కాలనీలకు జగనన్న నగర్లుగా మోక్షం..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అందరూ సంతృప్తిగా ఉండొచ్చు కానీ, అన్నీ పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్ కాలనీల విషయంలోనే కొంతమంది అసంతృప్తితో ఉన్నారన్నమాట వాస్తవం. అప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లను సీఎం జగన్ ఎందుకు పేదలకు కేటాయించలేదని నిలదీశాయి ప్రతిపక్షాలు. టిడ్కో ఇళ్లకోసం ఉద్యమాలే మొదలు పెట్టాయి. కానీ జగన్ కరగలేదు, కదలలేదు. వాటి గురించి పట్టించుకోనట్టే ఉన్నారు. మరోవైపు టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, వాటికి బ్యాలెన్సింగ్ […]

టిడ్కో ఎన్టీఆర్ కాలనీలకు జగనన్న నగర్లుగా మోక్షం..
X

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అందరూ సంతృప్తిగా ఉండొచ్చు కానీ, అన్నీ పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్ కాలనీల విషయంలోనే కొంతమంది అసంతృప్తితో ఉన్నారన్నమాట వాస్తవం. అప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లను సీఎం జగన్ ఎందుకు పేదలకు కేటాయించలేదని నిలదీశాయి ప్రతిపక్షాలు. టిడ్కో ఇళ్లకోసం ఉద్యమాలే మొదలు పెట్టాయి. కానీ జగన్ కరగలేదు, కదలలేదు. వాటి గురించి పట్టించుకోనట్టే ఉన్నారు. మరోవైపు టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, వాటికి బ్యాలెన్సింగ్ వర్క్ లు ఉన్నాయని, చివర్లో టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులివ్వలేదని, ఆ భారమంతా వైసీపీ ప్రభుత్వంపైనే పడుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరణలు ఇచ్చుకోలేక ఇబ్బంది పడ్డారు. ఈ దశలో సహజంగానే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి. తాము అధికారంలోకి వస్తే పూర్తి ఉచితంగా టిడ్కో ఇళ్లను ఇస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చిందని, ఇప్పుడు దాన్ని పక్కనపెట్టేసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. టీడీపీ కట్టిన ఇళ్లను ఇవ్వడం ఇష్టంలేకే వైసీపీ ఆ వ్యవహారాన్ని వాయిదా వేస్తోందని, దానికంటే ముందుగానే ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేసి అక్కడ ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెట్టారనే విమర్శ కూడా వినిపించింది. టిడ్కో అపార్ట్ మెంట్ల రంగులు మార్చడాన్ని కూడా తప్పుపట్టాయి ప్రతిపక్షాలు.

టిడ్కో ఇళ్లను కొన్నాళ్లపాటు కొవిడ్ క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగించుకున్న ప్రభుత్వం, వాటిపై తుది నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో టిడ్కో ఇళ్లకు వైఎస్ జగనన్న నగర్ లుగా నామకరణం కూడా చేసేశారు.

ఒక్క రూపాయికే ఇల్లు..
టిడ్కో ఇళ్లపై కాస్త ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా, వాటిని కేటాయించే విషయంలో ప్రభుత్వం ఉదారంగానే వ్యవహరించడం లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ల కోసం పేదల వద్ద నుంచి గత ప్రభుత్వం వసూలు చేసిన డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చేందుకు జగన్ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 1,43,600 మందికి ఒకే ఒక్క రూపాయితో ఇళ్లను ప్రభుత్వం అప్పగించబోతోంది. రెండు, మూడు కేటగిరీల కింద 365, 430 చదరపు అడుగులకు సంబంధించి లబ్ధిదారులు కట్టిన మొత్తంలో 50శాతం డబ్బును సబ్సిడీ రూపంలో ఇస్తామని గతంలోనే సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో 365 చదరపు అడుగుల అపార్ట్ మెంట్లు తీసుకున్నలబ్ధిదార్లకు రూ.25వేలు, 430 చదరపు అడుగుల లబ్ధిదార్లకు రూ.50 వేలు సబ్సిడీ రూపంలో అందుతుంది. ఈ మేరకు మినహాయించిన నగదును ప్రభుత్వం వెనక్కి ఇస్తుంది. త్వరలోనే ఇళ్ల పంపిణీ మొదలు పెడతామని చెబుతున్నారు.

First Published:  23 Feb 2021 8:17 PM GMT
Next Story