హైదరాబాద్ మెట్రోలో 'గుండె' తరలింపు
అవయవాలను తరలించడానికి ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అత్యంత వేగంగా ఒక దాత నుంచి గ్రహీత ఉండే ఆసుపత్రికి తరలించడం చూస్తుంటాము. ట్రాఫిక్ పోలీసులు రహదారిని క్లియర్ చేయడం ద్వారా అత్యంత వేగంగా అవయవాలు తరలిస్తుంటారు. అయితే తొలి సారిగా హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించారు. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ చెక్పోస్ట్ వరకు ఎక్కడా ఆగకుండా మెట్రోరైలును నడిపారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో నల్గొండ జిల్లాకు చెందిన రైతు ఒకరు బ్రెయిన్ […]
అవయవాలను తరలించడానికి ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అత్యంత వేగంగా ఒక దాత నుంచి గ్రహీత ఉండే ఆసుపత్రికి తరలించడం చూస్తుంటాము. ట్రాఫిక్ పోలీసులు రహదారిని క్లియర్ చేయడం ద్వారా అత్యంత వేగంగా అవయవాలు తరలిస్తుంటారు. అయితే తొలి సారిగా హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించారు.
నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ చెక్పోస్ట్ వరకు ఎక్కడా ఆగకుండా మెట్రోరైలును నడిపారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో నల్గొండ జిల్లాకు చెందిన రైతు ఒకరు బ్రెయిన్ డెడ్ అయ్యారు. దాంతో అతని బంధువులు గుండెను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులతో పాటు మెట్రో అధికారులకు తెలిపారు. వెంటనే ఎల్బీనగర్ కామినేని నుంచి నాగోల్ మెట్రో వరకు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
నాగోల్ మెట్రో స్టేషన్కు చేరుకున్న వెంటనే మెట్రోలోకి గుండెను చేర్చి.. అక్కడి నుంచి రైలును ఎక్కడా ఆపకుండా జూబ్లీ చెక్ పోస్టు వరకు నడిపారు. అక్కడి నుంచి అపోలో వరకు ట్రాఫిక్ క్లియర్ చేయడంతో గుండెను ఆసుపత్రికి తరలించారు. ఎల్బీనగర్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు రోడ్డు మీద అయితే మధ్యాహ్నం సమయంలో ఆలస్యం అవుతుందని మెట్రోలో తరలించినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో డాక్టర్ గోకులే నేతృత్వంలో గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేస్తున్నారు.