Telugu Global
NEWS

నిమ్మగడ్డకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పదే పదే లక్ష్మణరేఖ దాటుతున్న నిమ్మగడ్డ, మంత్రి పదవుల్లో ఉన్న తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు మంత్రి బొత్స. తమ హక్కులకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించించే విధంగా ప్రవర్తించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని స్పీకర్ ను కోరినట్లు మంత్రి బొత్స తెలిపారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల […]

నిమ్మగడ్డకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
X

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పదే పదే లక్ష్మణరేఖ దాటుతున్న నిమ్మగడ్డ, మంత్రి పదవుల్లో ఉన్న తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు మంత్రి బొత్స. తమ హక్కులకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించించే విధంగా ప్రవర్తించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని స్పీకర్ ను కోరినట్లు మంత్రి బొత్స తెలిపారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా, వాస్తవ దృక్ఫథంతో ఉండాలని, కానీ నిమ్మగడ్డ మాత్రం మంత్రి పదవుల్లో ఉన్న వ్యక్తుల ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా, కించపరిచే విధంగా గవర్నర్ కు లేఖ రాశారని చెప్పారు. తనతోపాటు మరో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిమ్మగడ్డ చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు బొత్స. లక్ష్మణరేఖ దాటామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని వాస్తవానికి ఆ లక్ష్మణ రేఖ దాటింది నిమ్మగడ్డేనని చెప్పారు. ఎన్నికలకు సంబంధం లేని అంశాలు మాట్లాడుతూ, రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలను రెచ్చగొడుతున్న నిమ్మగడ్డ ఇప్పటికి ఎన్నిసార్లు లక్ష్మణ రేఖ దాటారో ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. గాంధీజీ గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా ఏకగ్రీవాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే, దానికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసేలా నిమ్మగడ్డ నిర్ణయాలు, మీడియా సమావేశాల్లో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు బొత్స.

గవర్నర్ ని బెదిరిస్తారా..?
మంత్రులపై ఆరోపణలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నర్ కి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలను మంత్రి బొత్స తప్పుబట్టారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ మీద విశ్వాసం లేదని, అటార్ని జనరల్ తో సమాచారం తెలుసుకుని చర్యలు తీసుకోవాలని, లేకపోతే కోర్టుకు వెళతామంటూ ఏకంగా గవర్నర్ నే ఎస్ఈసీ బెదిరించారని గుర్తు చేశారు. గవర్నర్ చే నియమింపబడిన వ్యక్తి ఆ గవర్నర్ నే బెదిరించేలా లేఖ రాయడం గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు బొత్స.

రాజకీయాలు మాట్లాడాలంటే ఎస్ఈసీ పదవి వదిలెయ్..
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు విముఖత చూపినా, సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి తిరిగి ఎన్నికలకు సిద్ధపడ్డామని, అయితే రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్న నిమ్మగడ్డ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు బొత్స. మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక జారుకున్నారని ఎద్దేవా చేశారు.

కడప జిల్లా పర్యటనలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావిస్తూ, సీబీఐ కేసుల గురించి కూడా మాట్లాడారని, అసలు ఎన్నికల కమిషనర్ కు ఆయా విషయాలతో సంబంధం ఏంటని సూటిగా ప్రశ్నించారు. రాజకీయాలు మాట్లాడాలంటే.. ఎస్ఈసీ పదవికి నుంచి బయటకు రావాలని సవాల్ విసిరారు. ఏకగ్రీవాలు ఇంకా నిర్థారణ కాకముందే.. బలవంతపు ఏకగ్రీవాలంటూ నిమ్మగడ్డ మాట్లాడటం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయని ప్రశ్నించారు బొత్స. ఎన్నికల కమిషనర్ పదవిలో ఎంపైర్ లాగా ఉండాల్సన వ్యక్తి చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎంత మంది దుష్ట శక్తులు కట్టకట్టుకుని వచ్చినా.. అంతిమంగా 95శాతం స్థానాలు వైసీపీకే దక్కుతాయని చెప్పారు బొత్స.

First Published:  30 Jan 2021 8:58 PM GMT
Next Story