Telugu Global
Cinema & Entertainment

సుశాంత్ కేసులో శ్రుతీ మోడీ...ఎవరు?!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో సిబిఐ ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో నలుగురు నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు తల్లీ తండ్రి సోదరుడు కాగా ఐదవ వ్యక్తి శ్రుతీ మోడీ. సుశాంత్ కేసులో ఈమె పేరు ఎక్కువగా వినిపించలేదు. శ్రుతి… రియాకు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి మేనేజర్ గా పనిచేసిందనే వార్తలు వచ్చాయి. ముంబయి పోలీసులు గతంలో ఆమె స్టేట్ మెంట్ ని రికార్డు చేశారు. […]

సుశాంత్ కేసులో శ్రుతీ మోడీ...ఎవరు?!
X

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో సిబిఐ ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో నలుగురు నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు తల్లీ తండ్రి సోదరుడు కాగా ఐదవ వ్యక్తి శ్రుతీ మోడీ. సుశాంత్ కేసులో ఈమె పేరు ఎక్కువగా వినిపించలేదు. శ్రుతి… రియాకు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి మేనేజర్ గా పనిచేసిందనే వార్తలు వచ్చాయి.

ముంబయి పోలీసులు గతంలో ఆమె స్టేట్ మెంట్ ని రికార్డు చేశారు. శ్రుతి… సుశాంత్ వద్ద కూడా బిజినెస్ మేనేజర్ గా పనిచేసినట్టుగా ఆమె వెల్లడించిన వివరాల్లో ఉంది. సుశాంత్ కి ఆర్థిక సమస్యలు లేవని, బాంద్రా అపార్ట్ మెంట్ అద్దెతో సహా అతను నెలకు పదిలక్షలు ఖర్చు చేస్తాడని ఆమె ముంబయి పోలీసుల విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఆరవ నిందితుడిగా సిబిఐ కేసు నమోదు చేసిన వ్యక్తి పేరు సిద్ధార్థ్ పైఠానీ. ఇతను సుశాంత్ రూమ్మేట్, సహాయకుడు. వీరందరిపై ఇండియన్ పీనల్ కోడ్ లోని విభిన్న సెక్షన్ల కింద సిబిఐ కేసులను నమోదు చేసింది.

ఇంతకుముందు సుశాంత్ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు రియా చక్రవర్తిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుని సిబిఐకి ఇవ్వాల్సిందిగా బీహార్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరటంతో… సిబిఐకి దీనిని అప్పగించారు. రియా ఈ కేసు ఎఫ్ఐఆర్ ని బీహార్ నుండి ముంబయికి మార్చాల్సిందిగా సుప్రీంకోర్టుని కోరింది. అయితే కోర్టు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సుశాంత్ బ్యాంకు ఖాతానుండి డబ్బుని వేరే ఖాతాలకు తరలించిన కేసులో విచారించేందుకు రియాని, ఆమె సోదరుని పిలిచిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్… శ్రుతి మోడీకి సైతం సమన్లు పంపింది. రియా చక్రవర్తి శ్రుతికి అనేకసార్లు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈడీ ఎదుట హాజరు కావడానికి కొన్ని గంటల ముందు రియా… ముంబయికి ఎఫ్ఐఆర్ మార్చమంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసు విచారణ పూర్తయ్యే వరకు తనను ఇంటరాగేట్ చేయటం వాయిదా వేయాలని కోరగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అందుకు సమ్మతించలేదు.

First Published:  7 Aug 2020 10:03 AM GMT
Next Story