Telugu Global
International

ఐసోలేషన్‌కు సరికొత్త నిబంధనలు

కరోనా లక్షణాలు ఉన్నా, పాజిటివ్‌గా తేలినా సదరు వ్యక్తి వెంటనే ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రస్తుతం లక్షణాలు కనిపించకుండా కూడా కరోనా పాజిటివ్‌గా తేలుతున్నారు. వీరిలో ఆసుపత్రిలో చేరే వారి కంటే ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉండే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. మొదట్లో కరోనా సోకితే 14 రోజుల ఐసోలేషన్ చేసి.. నెగెటివ్ రెండు సార్లు వస్తే కానీ రోగం నయమయినట్లు వైద్యులు ధృవీకరించలేదు. కానీ ఇప్పుడు ఐసోలేట్ అయిన రెండు మూడు రోజులకే నెగెటివ్ వస్తున్నది. ఇక […]

ఐసోలేషన్‌కు సరికొత్త నిబంధనలు
X

కరోనా లక్షణాలు ఉన్నా, పాజిటివ్‌గా తేలినా సదరు వ్యక్తి వెంటనే ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రస్తుతం లక్షణాలు కనిపించకుండా కూడా కరోనా పాజిటివ్‌గా తేలుతున్నారు. వీరిలో ఆసుపత్రిలో చేరే వారి కంటే ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉండే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. మొదట్లో కరోనా సోకితే 14 రోజుల ఐసోలేషన్ చేసి.. నెగెటివ్ రెండు సార్లు వస్తే కానీ రోగం నయమయినట్లు వైద్యులు ధృవీకరించలేదు. కానీ ఇప్పుడు ఐసోలేట్ అయిన రెండు మూడు రోజులకే నెగెటివ్ వస్తున్నది. ఇక లక్షణాలు లేని వారికి 14 రోజులు దాటినా ఒక్కోసారి నెగెటివ్ రిజల్ట్ రావడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీడ్ కంట్రల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని.. వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించ పోయినా 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయవచ్చని సీడీసీ స్పష్టం చేసింది. పలు దేశాల్లో లక్షణాలు లేని వారిపై జరిపిన అధ్యయనం ఆధారంగా.. శరీరంలో వైరస్ తొమ్మిది నుంచి 11 రోజుల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండట్లేదని.. కాబట్టి లక్షణాలు లేని వాళ్లు ఇంటి వద్ద 10 రోజల పాటు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని చెప్పింది. కేవలం సీడీసీ మాత్రమే కాక ఇతర ప్రముఖ సంస్థలు కూడా ఐసోలేషన్‌పై మార్గదర్శకాలు విడుదల చేశాయి. లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వస్తే 10 రోజులు, స్వల్ప లక్షణాలు ఉంటే 13 రోజులు, తీవ్రమైన లక్షణాలు ఉండి ఆసుపత్రిలో చేరితే రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

ఇక యూకేలోని లీసెస్టర్ యూనివర్సిటీ వైరాలజిస్టులు 10 రోజులు ఐసోలేషన్ చాలని అంటున్నారు. 10 రోజుల తర్వాత వైరస్ ఉన్నా.. అది బలహీనపడిపోతున్నట్లు తమ క్లినికల్ పరీక్షల్లో తేలిందని వారు స్పష్టం చేశారు. నేచర్ అనే మెడికల్ జర్నల్ జరిపిన అధ్యయనంలో కరోనా శరీరంలో ప్రవేశించాక ఉత్పత్తి అవుతున్న యాంటీ బాడీలు అయిదో రోజు నుంచే వైరస్‌ను నిర్వీర్యం చేస్తున్నాయని పేర్కొంది. తొమ్మిది రోజుల తర్వాత వైరస్ అసలు శరీరంలో ఉండటం లేదని.. అది మరొకరికి సంక్రమించే అవకాశం తక్కువని.. కాబట్టి పది రోజుల ఐసోలేషన్ చాలని అంటున్నారు.

ఇక సింగపూర్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్షియల్ వేయబుల్ చేసిన అధ్యయనంలో 11 రోజుల తర్వాత మానవ శరీరంలో వైరస్ బలహీనపడినట్లు గ్రహించారు. అంటే 10 రోజుల ఐసోలేషన్ తర్వాత రోగి మామూలుగా తిరగొచ్చని చెప్పారు. మన దేశంలో మాత్రమే మిగతా వారికంటే ఐసోలేషన్ నిబంధనలు వేరుగా ఉన్నాయి. కోవిడ్ రోగులకు వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటేనే వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో విడిగా ఉండాలి. ఆ తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులతో కలవవచ్చు. కానీ ఏడు రోజులు ఇంట్లోనే ఉండాలి. ఆ తర్వాత కానీ వాళ్లు బయటకు రావడానికి వీళ్లేదు.

ప్రస్తుతం సీడీసీ నిబంధనలు మన దగ్గర కూడా అమలు చేస్తే.. లక్షణాలే లేని వాళ్లు 10 రోజుల తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రష్యాలో అయితే 14 రోజుల ఐసోలేషన్ నిబంధన అమలులో ఉంది. నెగెటివ్ వచ్చిన తర్వాత మాత్రమే వారిని ఇంటి నుంచి బయటకు రానిస్తున్నారు.

First Published:  27 July 2020 11:02 PM GMT
Next Story