Telugu Global
National

దావత్ లు‌, ఫంక్షన్‌లే కొంపముంచుతున్నాయా?

తెలంగాణలో కరోనా కంట్రోల్‌ కావడం లేదు. మొన్నటివరకూ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాత్రమే కేసులు కనిపించేవి. కానీ ఇప్పుడు జిల్లాల్లో కూడా కేసులు విస్తరిస్తున్నాయి. పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో నిన్న ఒక్క రోజే 92 కేసులు నమోదు అయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 12 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. సంగారెడ్డిలో 57, వరంగల్ అర్బన్‌ 47, నల్గొండలో 64, వనపర్తిలో 51 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. జిల్లాల్లో భారీగా ఈ కేసులు […]

దావత్ లు‌, ఫంక్షన్‌లే కొంపముంచుతున్నాయా?
X

తెలంగాణలో కరోనా కంట్రోల్‌ కావడం లేదు. మొన్నటివరకూ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాత్రమే కేసులు కనిపించేవి. కానీ ఇప్పుడు జిల్లాల్లో కూడా కేసులు విస్తరిస్తున్నాయి. పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి.

కరీంనగర్‌ జిల్లాలో నిన్న ఒక్క రోజే 92 కేసులు నమోదు అయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 12 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. సంగారెడ్డిలో 57, వరంగల్ అర్బన్‌ 47, నల్గొండలో 64, వనపర్తిలో 51 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

జిల్లాల్లో భారీగా ఈ కేసులు ఎలా నమోదు అవుతున్నాయి? ప్రైమరీ కాంటాక్ట్‌లు ఎక్కడి నుంచి వచ్చారు? అని ఆరా తీస్తే 90 శాతం హైదరాబాద్ తో సంబంధం ఉన్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. దావత్‌ల కోసమో… లేకపోతే ఫంక్షన్‌ ల కోసమో, వ్యాపారం కోసమో హైదరాబాద్‌ వచ్చి తిరిగి వెళ్లిన వారి నుంచి జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. కుటుంబాలకు కుటుంబాలు వైరస్‌ బారినపడుతున్నాయి.

ఇటీవల వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు ఫంక్షన్‌ కోసం ఓ 40 మందికి పైగా బంధువులు వచ్చారు. తిరిగి వెళ్లిన తర్వాత వీరిలో 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. మొన్నటివరకూ హుస్నాబాద్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన అల్లుడు మామ ఇంట్లో వైరస్ అంటించాడు. అక్కడ రెండు కేసులు నమోదు అయ్యాయి.

సింగరేణిలో కూడా కరోనా కలకలం రేపుతోంది. జీడీకే1 గని పరిధిలో కార్మికులు ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కోల్‌బెల్ట్‌ పరిధిలో ఇప్పటివరకూ నలుగురు మృతిచెందారు. దీంతో ఇక్కడ కూడా దావత్‌లే కొంపముంచాయని తెలుస్తోంది. దావత్‌కు వెళ్లిన కార్మికులు కరోనా బారినపడ్డారనే ప్రచారం జరుగుతోంది

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుకు కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకూ ఐదుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ కలెక్టర్ శ్వేతా మహంతికి కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె కూడా చికిత్స తీసుకుంటున్నారు.

మొత్తానికి జిల్లాలకు కరోనా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు పట్టణాల్లో వ్యాపారులు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత షాపులు మూసివేస్తున్నారు. పెద్దపల్లిలో వారం పాటు లాక్‌డౌన్‌ పాటించాలని పాలకవర్గం నిర్ణయించింది.

First Published:  16 July 2020 11:18 PM GMT
Next Story