Telugu Global
National

వలస కూలీలకు ఊరట... స్వగ్రామాలకు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. కేంద్ర ప్రభుత్వం ఒకే సారి లాక్‌డౌన్ ప్రకటించడంతో పొట్ట కూటి కోసం దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులు, కూలీలు.. చదువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులతో పాటు పర్యాటకులు చిక్కుకొని పోయారు. గత నెల రోజులకు పైగా వీళ్లు సరైన తిండి, వసతి లేక ఊరుగాని ఊర్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడు వీరిని స్వస్థలాలకు చేర్చడానికి కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల […]

వలస కూలీలకు ఊరట... స్వగ్రామాలకు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. కేంద్ర ప్రభుత్వం ఒకే సారి లాక్‌డౌన్ ప్రకటించడంతో పొట్ట కూటి కోసం దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులు, కూలీలు.. చదువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులతో పాటు పర్యాటకులు చిక్కుకొని పోయారు. గత నెల రోజులకు పైగా వీళ్లు సరైన తిండి, వసతి లేక ఊరుగాని ఊర్లో అష్టకష్టాలు పడుతున్నారు.

ఇప్పుడు వీరిని స్వస్థలాలకు చేర్చడానికి కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఉత్తర్వులు జారీ చేశారు. వలస కార్మికులతో పాటు ఆయా ప్రాంతాల్లో చిక్కుకొని పోయిన విద్యార్థులు, ఇతరులను తరలించడానికి అన్ని రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించుకోవాలని కేంద్రం ఆదేశాల్లో పేర్కొంది. కాగా వారిని స్వగ్రామాలకు పంపడానికంటే ముందే అందరి వివరాలను సేకరించాలని హోంశాఖ పేర్కొంది.

కూలీలు, కార్మికులు, విద్యార్థుల తరలింపుపై ఇరు రాష్ట్రాల అంగీకారం తప్పనిసరని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని చెప్పారు. తరలింపులో భౌతిక దూరం పాటించాలని, రవాణాకు ఉపయోగించే బస్సుల్లో కూడా దూరం పాటిస్తూ, వాటిని శానిటైజ్ చేయాలని కేంద్రం చెప్పింది. స్వస్థలాలకు చేరుకున్న తర్వాత కూడా అందరికీ మరోసారి పరీక్షలు నిర్వహించాలని.. అనారోగ్యంగా కనపడితే వారికి తప్పకుండా క్వారంటైన్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా బాధితులను ట్రాక్ చేయడానికి కేంద్రం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్‌ను అందరి ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయాలని.. వారందరూ స్వస్థలాలకు వెళ్లే వరకు తప్పని సరిగా యాప్ ద్వారా ట్రాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అనారోగ్యంగా ఉంటే క్వారంటైన్‌కు వెళ్తామని హామీ ఇస్తేనే వారిని తరలించాలని కేంద్రం చెప్పింది. వారికి స్వగ్రామాల వరకు రవాణా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

First Published:  29 April 2020 8:31 AM GMT
Next Story