Telugu Global
NEWS

ఇంగ్లీష్‌ మీడియంపై ప్రభుత్వం కొత్త నిర్ణయం

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోలను ఇటీవల హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మొత్తం తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ప్రస్తుతం 1 నుంచి 5 వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో విద్యను అసభ్యసిస్తున్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ […]

ఇంగ్లీష్‌ మీడియంపై  ప్రభుత్వం కొత్త నిర్ణయం
X

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోలను ఇటీవల హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం మొత్తం తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ప్రస్తుతం 1 నుంచి 5 వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో విద్యను అసభ్యసిస్తున్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని జీవో ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో మీ పిల్లలను ఏ మీడియంలో చదివించాలనుకుంటున్నారు? అన్న దానిపై ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులందరి నుంచి అభిప్రాయాన్ని తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ప్రస్తుతం కరోనా కారణంగా స్కూళ్లు మూసివేసిన నేపథ్యంలో… పిల్లల ఇళ్ల వద్దకే వెళ్లి వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయం తెలుసుకోవాలని ఆదేశించింది. ఈ అభిప్రాయ సేకరణ కోసం విలేజ్, వార్డు వాలంటీర్ల సేవలను వాడుకోవాల్సిందిగా సూచించింది. ప్రత్యేక నమూనా ద్వారా తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 93.77 శాతం పేరంట్స్ కమిటీలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ తీర్మానాలు చేశాయని ప్రభుత్వం వాదనల సమయంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కేవలం 1.38 శాతం పేరెంట్స్ కమిటీలు మాత్రమే తెలుగు మీడియం కోసం తీర్మానం చేశాయని కోర్టుకు ప్రభుత్వం వివరించింది.

తెలుగుమీడియం చదివే వారి కోసం మండలానికి ఒక తెలుగుమీడియం స్కూల్ ఏర్పాటు చేస్తామని… ఆ పిల్లలకు రవాణా భారం కూడా ప్రభుత్వమే భరిస్తుందని వివరించింది. అయితే పిల్లలు ఏ మీడియంలో చదవాలన్నది నిర్ణయించుకునే హక్కు పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుందని… పేరెంట్స్ కమిటీల తీర్మానం ఆధారంగా ఇంగ్లీష్ మీడియంను సమర్ధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించేందుకు సిద్ధమైంది.

First Published:  22 April 2020 5:49 AM GMT
Next Story