Telugu Global
NEWS

పేద తల్లిదండ్రులకు ఇంగ్లీష్‌ రాదు... వారు పిల్లలను గైడ్ చేయలేరు... అందుకే ఇంగ్లీష్‌పై కోర్టుకు

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టకుండా కోర్టుకు వెళ్లి అడ్డుకున్న బీజేపీ నేత సుధీష్‌ రాంబొట్ల వివరణ ఇచ్చారు. ఆయన్ను నెటిజన్లు, బీసీ, ఎస్సీఎస్టీ వర్గాలకు చెందిన వారు విపరీతంగా ట్రోల్ చేస్తుండడంతో ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. తాను పేద పిల్లల మంచి కోసమే కోర్టుకు వెళ్లానని చెప్పారు. అందుకు ఒక లాజిక్‌ కూడా ఆయన వివరించారు. ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ తప్పనిసరి చేయడం వల్ల పేద పిల్లలే నష్టపోతారని… అందుకే […]

పేద తల్లిదండ్రులకు ఇంగ్లీష్‌ రాదు... వారు పిల్లలను గైడ్ చేయలేరు... అందుకే ఇంగ్లీష్‌పై కోర్టుకు
X

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టకుండా కోర్టుకు వెళ్లి అడ్డుకున్న బీజేపీ నేత సుధీష్‌ రాంబొట్ల వివరణ ఇచ్చారు. ఆయన్ను నెటిజన్లు, బీసీ, ఎస్సీఎస్టీ వర్గాలకు చెందిన వారు విపరీతంగా ట్రోల్ చేస్తుండడంతో ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. తాను పేద పిల్లల మంచి కోసమే కోర్టుకు వెళ్లానని చెప్పారు. అందుకు ఒక లాజిక్‌ కూడా ఆయన వివరించారు. ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ తప్పనిసరి చేయడం వల్ల పేద పిల్లలే నష్టపోతారని… అందుకే తాను హైకోర్టుకు వెళ్లినట్టు ఆయన చెప్పారు.

స్కూల్‌ నుంచి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పర్యావేక్షణ చాలా ముఖ్యమని… ఒకవేళ స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పెడితే ఆ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత పేద తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు కాబట్టి… వారు పిల్లలను ఇంటి వద్ద సరిగ్గా గైడ్ చేయలేరని రాంబొట్ల విశ్లేషించారు. దాని వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందనిచెప్పారు. అదే డబ్బున్న వారు, ఇంగ్లీష్ వచ్చిన తల్లిదండ్రులు… వారి పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చిన తర్వాత ఇంగ్లీష్‌లో గైడ్ చేయగలుగుతారు కాబట్టి డబ్బున్న పిల్లలకు ఇబ్బంది ఉండదని ఆయన వివరించారు.

ఇంగ్లీష్ రాని తల్లిదండ్రుల పిల్లలకు ఇంటి వద్ద సరైన గైడ్ లైన్స్ దొరకవు కాబట్టి వారు స్కూల్ నుంచి డ్రాపట్ అయ్యే అవకాశం ఉందని సుధీష్ రాంబొట్ల వివరించారు. వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్, చంద్రబాబు కూడా తెలుగుమీడియంలోనే చదువుకుని గొప్ప వారు అయ్యారని కూడా ఆయన తన వీడియోలో గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్తే అక్కడ కూడా తాను వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రాథమిక విద్య మాతృభాషలో సాగితే పిల్లల్లో అవగాహన శక్తి, మానసిక వికాసం బాగుంటుందని చెప్పారు.

అయితే రాంబొట్ల వివరణపైనా విమర్శలు వస్తున్నాయి. పేద తల్లిదండ్రులకు ఇంగ్లీష్‌ రాకపోతే ఇక వారి పిల్లలు కూడా ఇంగ్లీష్‌ మీడియంకు దూరంగా ఉండాలా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక విద్య మాతృ భాషలోనే ఉండాలంటున్న వారు మరి… వారి పిల్లలను ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తున్నారు అన్న ప్రశ్న కూడా వస్తుంది. అంటే డబ్బున్న వారి పిల్లల మాతృ భాష తెలుగు కాకుండాపోయిందా? అని ప్రశ్నిస్తున్నారు.

First Published:  17 April 2020 9:06 PM GMT
Next Story