Telugu Global
NEWS

ఫ్యాక్షనిస్టు రాజ్యమంటూ నిమ్మగడ్డ రమేష్ లేఖ దేనికి సంకేతం !

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు దేశంపార్టీ నాయకులు కుల రాజకీయాలు చేయడంపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన రాయచోటిలో మీడియా సమావేశంలో…. టిడిపి సిగ్గుమాలిన రాజకీయాలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు ప్రణాళికా బద్దంగా చర్యలు చేపడుతూ… రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తోందన్నారు. క్వారంటెయిన్ నుంచి డిశ్చార్జి కాబడిన వ్యక్తికి ప్రభుత్వము ఆర్ధిక సహాయంగా రూ.2 వేలు ఇస్తామనడం […]

ఫ్యాక్షనిస్టు రాజ్యమంటూ నిమ్మగడ్డ రమేష్ లేఖ దేనికి సంకేతం !
X

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు దేశంపార్టీ నాయకులు కుల రాజకీయాలు చేయడంపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.

గురువారం ఆయన రాయచోటిలో మీడియా సమావేశంలో…. టిడిపి సిగ్గుమాలిన రాజకీయాలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు ప్రణాళికా బద్దంగా చర్యలు చేపడుతూ… రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తోందన్నారు.

క్వారంటెయిన్ నుంచి డిశ్చార్జి కాబడిన వ్యక్తికి ప్రభుత్వము ఆర్ధిక సహాయంగా రూ.2 వేలు ఇస్తామనడం అభినందనీయమన్నారు. కానీ ఇవేవీ గిట్టని తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పాలనపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.

పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని టిడిపి నేతలు కుట్రలు, కుతంత్రాలు చేయడం దారుణమన్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దని విమర్శించే ప్రతి నాయకుడు తమ బిడ్డలను తెలుగుమీడియంలోనే చదివిస్తామని ప్రమాణం చేయాలంటూ ఆయన సవాల్ విసిరారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటే చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. మీ పిల్లలు మాత్రం విదేశాలకు వెళ్లి ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలి, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పడం ఇదేమి న్యాయమంటూ శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు.

జపాన్ వెళ్ళినప్పుడు జపాన్ అభివృద్ధి చెందినది కాబట్టి జపాన్ భాషను నేర్చుకోవాలని చెప్పిన చంద్రబాబు… ఇక్కడ మాత్రం పేదల పిల్లలకు ఇంగ్లీష్ వద్దని అదే చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్… ఫ్యాక్షనిస్టు రాజ్యమంటూ లేఖ రాయడం దేనికి సంకేతమంటూ ఆయన ప్రశ్నించారు.

అలాగే మరో మాజీ ఎంపీ కులం జోలికి వస్తే లేపేస్తామంటూ వ్యాఖ్యానాలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోందన్నారు. ప్రస్తుత కరోనా విపత్తు సమయం లో సామాజిక దూరం పాటించాలే కానీ , సామాజికంగా కులాలను విడదీసే భయంకరమైన వ్యాధికి తెరతీయడం మంచిది కాదన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.

సీఎం వైఎస్ జగన్ ని లేపే ధైర్యం ఉంటే రోడ్డు పైకి రావాలని ఆయన సవాల్ విసిరారు. గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తిని ఇలాంటి వ్యక్తులే పొట్టన పెట్టుకున్నారంటూ ఆవేదనతో మాట్లాడారు.

రాజధాని వికేంద్రీకరణ విషయంలో వ్యతిరేకించడంతో పాటు కీయా కంపెనీ పై లేని పోని వదంతులను సృష్టించింది మీరు కాదా అని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగు మహా సభలను నిర్వహించిందే మహానేత వై.ఎస్.ఆర్ అని గుర్తుంచుకోవాలన్నారు.

కుల మతాలతో మాకు పనిలేదని… రాష్టంలో 50 శాతం రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాలకు కల్పించింది సి.ఎం.జగన్ అని ఆయన తెలిపారు. మాది కత్తులు పట్టుకుని దోమలు, ఎలుకల పై యుద్ధం అంటూ పబ్లిసిటీ చేసుకునే ప్రభుత్వం కాదన్నారు. దోమకు రూ.5 వేలు, ఎలుకకు రూ. 10 వేలు చొప్పున కాజేసే ప్రభుత్వం అసలు కాదన్నారు.

విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించే నిధులను ఇకపై వారి తల్లుల ఖాతాలలో జమ చెయ్యాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి పేరిట రూ 3 లక్షల కోట్లు అప్పు చేయడం, 60 వేల కోట్ల రూపాయలు బిల్లులను పెండింగ్ లో పెట్టడమే కాకుండా ఫీజు రీయంర్స్ మెంట్ డబ్బులు చెల్లించక విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారన్నారు. నాటి విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లింపుల సంబంధించి రూ.2వేల కోట్లను సి ఎం జగన్ చెల్లించిన విషయాన్ని గుర్తెరగాలన్నారు.

కరోనా కారణంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం రేషన్ కార్డ్ లేనివారికి కూడా బియ్యాన్ని ఉచితంగా అందచేయడమే కాక 3 రోజులలో వారికి శాశ్వత కార్డులను అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఎదుర్కొని రెండు అడుగులు ముందుకు వేయడం సి ఎం జగన్ నైజం అని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఉద్గాటించారు.

First Published:  16 April 2020 6:24 AM GMT
Next Story