Telugu Global
National

పరీక్షల్లో ఏపీ వేగం...

కరోనాను ఎదుర్కోవడంలో పరీక్షలే కీలకం. ఎక్కువ పరీక్షలు చేయగలిగితే వ్యాధి వ్యాప్తిని గుర్తించేందుకు వీలవుతుంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరీక్షల సామర్థ్యాన్ని ఏపీ అనూహ్యంగా పెంచుకుంటోంది. ఫిబ్రవరి 15న తొలి కరోనా పరీక్షల ల్యాబ్‌ను ఏపీలో ఏర్పాటు చేశారు. అప్పుడు రోజుకు90 పరీక్షలు మాత్రమే చేసే సామర్థ్యం ఏపీలో ఉండేది. ల్యాబ్‌ల సంఖ్యను పెంచుతూ వెళ్లి ఏప్రిల్‌ ఐదు నాటికి రోజుకు 1080 పరీక్షలు నిర్వహించే […]

పరీక్షల్లో ఏపీ వేగం...
X

కరోనాను ఎదుర్కోవడంలో పరీక్షలే కీలకం. ఎక్కువ పరీక్షలు చేయగలిగితే వ్యాధి వ్యాప్తిని గుర్తించేందుకు వీలవుతుంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరీక్షల సామర్థ్యాన్ని ఏపీ అనూహ్యంగా పెంచుకుంటోంది.

ఫిబ్రవరి 15న తొలి కరోనా పరీక్షల ల్యాబ్‌ను ఏపీలో ఏర్పాటు చేశారు. అప్పుడు రోజుకు90 పరీక్షలు మాత్రమే చేసే సామర్థ్యం ఏపీలో ఉండేది. ల్యాబ్‌ల సంఖ్యను పెంచుతూ వెళ్లి ఏప్రిల్‌ ఐదు నాటికి రోజుకు 1080 పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని ఏపీ సొంతం చేసుకుంది.

ఇప్పుడు రోజుకు రెండు వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 12వేల 500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇది దేశ సగటు కంటే చాలా అధికం.

ప్రస్తుతం దేశంలో ప్రతి పది లక్షల మందికి సగటున 157 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలో మాత్రం ఆ సగటు ఇప్పటికే 255కు చేరింది. పరీక్షల నిర్వాహణ సామర్థ్యంలో కరోనాను తొలుత చవిచూసిన కేరళతోపాటు, అత్యధిక కేసులున్న మహారాష్ట్ర, రాజస్థాన్ తర్వాత నాలుగో స్థానంలో ఏపీ ఉంది.

రాబోయే పది రోజుల్లో ఏపీలో పరీక్షల సామర్థ్యం అనూహ్యంగా పెరగనుంది. ఏపీలో ప్రస్తుతం తొమ్మిది వీఆర్‌డీఎల్‌ ల్యాబులున్నాయి. వీటితో పాటు ఎనిమిది సెంటర్లలో భారీగా ట్రూనాట్‌ మిషన్లను ఉంచి పరీక్షలు చేస్తున్నారు. దేశం మొత్తం మీద ట్రూనాట్ మిషిన్లు 500 వరకు ఉండగా…. ఒక్క ఏపీలోనే 225 ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ అంశం ఏపీకి బాగా కలిసివస్తోందంటున్నారు.

ప్రస్తుతం రోజుకు 2,100 పరీక్షలు నిర్వహిస్తుండగా… మరో నాలుగు రోజుల్లో ఆ సామర్థ్యం నాలుగు వేలకు చేరుతుందని మంగళవారం ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు వివరించారు.

కేంద్రం నుంచి రాపిడ్ కిట్లు కూడా వస్తే అన్ని మార్గాల ద్వారా పది పదిహేను రోజుల్లో రోజువారి పరీక్షల సామర్థ్యం 15వేల వరకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన 32వేల మందికి పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే మండలం ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండం పరీక్షలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఏపీలో తక్కువ పరీక్షలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న వాదనలో ఎలాంటి పస లేదు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు చేసిన పరీక్షల సగటును చూసినా, రోజురోజుకు పెంచుకుంటున్న సామర్థ్యాన్ని పరిశీలించినా…. ప్రస్తుతం దేశంలోనే అత్యథిక పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నాలుగో స్థానంలో ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దేశంలోనే అత్యథిక పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

First Published:  16 April 2020 2:09 AM GMT
Next Story