Telugu Global
National

లబ్దిదారుల ఎంపికలో పార్టీ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరా... సీఎం అస్సలు అంగీకరించలేదు

ఏపీ కేబినేట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూనియర్ న్యాయవాదులకు ఐదువేల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 21 నుంచి వైఎస్‌ఆర్ నేతన్న కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ పథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి 24వేల ఆర్థిక సాయం అందించనున్నారు. కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు సమాచారశాఖ మంత్రి పేర్నినాని వివరించారు. గత ప్రభుత్వంలో సచివాలయం నుంచే ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మామూళ్ల […]

లబ్దిదారుల ఎంపికలో పార్టీ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరా... సీఎం అస్సలు అంగీకరించలేదు
X

ఏపీ కేబినేట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూనియర్ న్యాయవాదులకు ఐదువేల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 21 నుంచి వైఎస్‌ఆర్ నేతన్న కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ పథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి 24వేల ఆర్థిక సాయం అందించనున్నారు.

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు సమాచారశాఖ మంత్రి పేర్నినాని వివరించారు. గత ప్రభుత్వంలో సచివాలయం నుంచే ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మామూళ్ల వసూలు వ్యవహారం నడిచిందన్నారు. అలాంటి దోపిడి లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

ఇకపై ఒక్క రూపాయి కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. మధ్యవర్తి సంస్థలు సగం జీతం మింగేసి… అరకొరమాత్రమే ఉద్యోగులకు ఇచ్చే దోపిడి కూడా ఉండదన్నారు. నేరుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అకౌంట్లలోకి జీతాలు పడేలా కార్పొరేషన్ ద్వారా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

పలాసాలో నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్బంగా జూనియర్ న్యాయవాదులకు ఐదు వేల ఆర్థిక సాయం అందించనున్నట్టు పేర్నినాని తెలిపారు. లా చదివి బార్ అసోసియేషన్‌లో ఎన్‌రోల్ అయిన ప్రతి జూనియర్ న్యాయవాదికి మూడేళ్ల పాటు నెలకు 5వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

హోంగార్డుల రోజువారి వేతనాన్ని 600 నుంచి 710 రూపాయలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మత్స్యకారుల బోట్లకు ఉపయోగించే డీజిల్‌పై లీటర్‌కు రూ.9 సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. వేట నిషేద సమయంలో మత్స్యకారులకు నెలకు 10వేలు ఇస్తామన్నారు.

ప్రభుత్వ రవాణాలో అవసరమైన లారీలు, చిన్నచిన్న ట్రాన్స్‌పోర్టుకు అవసరమైన వాహనాలను ఎస్సీ ఎస్టీ బీసీ, కాపు కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు సబ్సిడీపై ఇప్పిస్తామన్నారు. లబ్దిదారుల ఎంపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రమేయం లేకుండా నేరుగా కలెక్టర్ సమక్షంలోనే లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు చెప్పారు.

పార్టీతో పాటు ఉన్న వారికి వెసులుబాటు కోసం వాహన లబ్దిదారుల ఎంపికలో అవకాశం ఇవ్వాలని తానే విజ్ఞప్తి చేసినా ముఖ్యమంత్రి అంగీకరించలేదని… ఎలాంటి పక్షపాతం లేకుండా నిస్పక్షపాతంగానే లబ్దిదారుల ఎంపిక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. లాటరీ ద్వారానే లబ్దిదారుల ఎంపిక ఉండాలని… రాజకీయాలకు అతీతంగానే ఎంపిక ఉండాలన్నారు.

ఆర్టీసీలో 3,500 బస్సుల కాల పరిమితి ముగుస్తోందని ఈ నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు కోసం వెయ్యి కోట్లు లోన్ తీసుకోవాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించినట్టు పేర్ని నాని చెప్పారు. జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇసుక వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమేనన్నారు. ఇందుకు కారణం భారీ వరదలేనన్నారు. ఇసుక గురించి ముఖ్యమంత్రి ఆలోచించడం లేదన్నది సరికాదన్నారు. కానీ రాష్ట్రాల్లోని నదులలో భారీ ప్రవాహం ఉందని… అందువల్లే ఇబ్బంది వచ్చిందన్నారు. వరద తగ్గే వరకు ఏమీ చేయలేని నిస్సహాయత ఏర్పడిందన్నారు.

ఒకే ఏడాది ఆరు సార్లు కృష్ణకు వరద రావడం గతంలో ఎన్నడూ లేదన్నారు. గత ప్రభుత్వ ఇసుక దోపిడి కారణంగా ఎన్‌ఎస్‌టీ కూడా ఇసుక తవ్వకాలపై అనేక ఆంక్షలు పెట్టిందన్నారు.

First Published:  16 Oct 2019 6:14 AM GMT
Next Story