Telugu Global
NEWS

భారత్ " విండీస్ టీ-20 సమరానికి కౌంట్ డౌన్

ఫ్లారిడా వేదికగా మరికొద్దిగంటల్లో తొలిపోటీ రెండేళ్ల తర్వాత విండీస్ జట్టులో సునీల్ నరైన్ ధూమ్ ధామ్ టీ-20 ఐదో ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ విండీస్ జట్ల తీన్మార్ సిరీస్ కు… అమెరికా గడ్డపై రంగం సిద్ధమయ్యింది. సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ లకు ఫ్లారిడాలోని లాడర్ హిల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఫ్లారిడా చుట్టుపక్కల ప్రాంతాలలో భారత సంతతి అభిమానులు ఎక్కువగా ఉండడంతో సిరీస్ లోని మొదటి రెండు టీ-20 మ్యాచ్ లను లాడర్ హిల్ స్టేడియంలో నిర్వహించాలని […]

భారత్  విండీస్ టీ-20 సమరానికి కౌంట్ డౌన్
X
  • ఫ్లారిడా వేదికగా మరికొద్దిగంటల్లో తొలిపోటీ
  • రెండేళ్ల తర్వాత విండీస్ జట్టులో సునీల్ నరైన్

ధూమ్ ధామ్ టీ-20 ఐదో ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ విండీస్ జట్ల తీన్మార్ సిరీస్ కు… అమెరికా గడ్డపై రంగం సిద్ధమయ్యింది. సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ లకు ఫ్లారిడాలోని లాడర్ హిల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఫ్లారిడా చుట్టుపక్కల ప్రాంతాలలో భారత సంతతి అభిమానులు ఎక్కువగా ఉండడంతో సిరీస్ లోని మొదటి రెండు టీ-20 మ్యాచ్ లను లాడర్ హిల్ స్టేడియంలో నిర్వహించాలని విండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.

ప్రపంచకప్ సెమీస్ ఓటమి తర్వాత….

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ సెమీఫైనల్లోనే భారత్ ఓటమి పొందిన నేపథ్యంలో..తొలి విదేశీ పర్యటనకు కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు…ఎక్కువ మంది యువఆటగాళ్లతో సిద్ధమయ్యింది.

వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు లేకుండా భారత్ టీ-20 సమరానికి …పవర్ ఫుల్ విండీస్ తో సై అంటోంది.

మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, ఖలీల్ అహ్మద్, చహార్ బ్రదర్స్ లాంటి యువఆటగాళ్ల సత్తాకు ఈ సిరీస్ అసలు
సిసలు పరీక్షగా నిలువనుంది.

సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కొహ్లీ… భారత టాపార్డర్ కు కీలకంకానున్నారు. కరీబియన్ పవర్ … జెయింట్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వెయిట్ నాయకత్వంలోని విండీస్… పవర్ ఫుల్ టీమ్ తో భారత్ కు సవాలు విసురుతోంది.

మెరుపు ఆల్ రౌండర్లు యాండ్రీ రస్సెల్, జాదూ స్పిన్నర్ సునీల్ నరైన్ కీలకపాత్ర పోషించబోతున్నారు.

అంతేకాదు.. మ్యాజిక్ స్పిన్నర్ సునీల్ నరైన్ రెండేళ్ల విరామం తర్వాత విండీస్ జట్టు తరపున బరిలోకి దిగుతున్నాడు.
భారత్ 3-1 రికార్డు… ఈ రెండుజట్లూ తలపడిన గత ఐదు టీ-20 మ్యాచ్ ల్లో భారత్ 3 విజయాలు, ఓ పరాజయం రికార్డుతో ఉంది. మరోసారి హాట్ ఫేవరెట్ గా సిరీస్ వేటకు విరాట్ సేన దిగుతోంది.

ఫ్లారిడాలో డబుల్ థమాకా…. మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండు టీ-20 మ్యాచ్ లను ఫ్లారిడాలోని లాడెర్ హిల్ కు చెందిన బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. ఈ రెండుమ్యాచ్ లూ ఆగస్టు 3, 4 తేదీలలో జరుగుతాయి.

సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ ను గయానా నేషనల్ స్టేడియం వేదికగా ఆగస్టు 6న నిర్వహిస్తారు.

బ్రాత్ వెయిట్ నాయకత్వంలోని విండీస్ జట్టు సభ్యుల్లో సునీల్ నరైన్, కీమో పాల్, కీరాన్ పోలార్డ్, యాండ్రీ రసెల్, ఖరే పియరీ, నికోలస్ పూరన్, రోమో పావెల్, ఆంథోనీ బ్రాంబెల్, ఒషియన్ థామస్, జాన్ కాంప్ బెల్, షెల్డన్ కోట్రెల్, ఇవిన్ లూయిస్, హెట్ మేయర్ ఉన్నారు.

రెండుజట్లు సమానబలం కలిగి ఉండడంతో సిరీస్ నువ్వానేనా అన్నట్లుగా సాగే అవకాశం ఉంది.

మొదటి రెండు మ్యాచ్ లకు ఫ్లారిడాలోని భారత సంతతి అభిమానులు ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉంది.

First Published:  3 Aug 2019 12:28 AM GMT
Next Story