Telugu Global
CRIME

మహిళా తహసీల్దార్ ఇంట్లో నోట్ల కట్టలు

ఆ ఇంట్లో ఎక్కడ చూసినా రెండు వేల రూపాయలు, ఐదు వందల రూపాయల కట్టలే. అలా అని అది బ్యాంకు కాదు. పోనీ బడా పారిశ్రామికవేత్త ఇల్లో…. లేదూ సినిమా స్టార్ ఇల్లో కాదు. అయినా ఏ మూల చూసినా కట్టలే కట్టలు. బీరువాలోనూ, కప్ బోర్డుల్లోనూ… ఇలా ఎక్కడ చూసినా డబ్బు కట్టలే కనిపించాయి. కేవలం మూడు గంటల పాటు ఓ మహిళా తాహసీల్దార్ ఇంటో తనిఖీ చేసిన ఏసీబీ అధికారులకు పట్టుబడింది అక్షరాల 93 […]

మహిళా తహసీల్దార్ ఇంట్లో నోట్ల కట్టలు
X

ఆ ఇంట్లో ఎక్కడ చూసినా రెండు వేల రూపాయలు, ఐదు వందల రూపాయల కట్టలే. అలా అని అది బ్యాంకు కాదు. పోనీ బడా పారిశ్రామికవేత్త ఇల్లో…. లేదూ సినిమా స్టార్ ఇల్లో కాదు. అయినా ఏ మూల చూసినా కట్టలే కట్టలు. బీరువాలోనూ, కప్ బోర్డుల్లోనూ… ఇలా ఎక్కడ చూసినా డబ్బు కట్టలే కనిపించాయి.

కేవలం మూడు గంటల పాటు ఓ మహిళా తాహసీల్దార్ ఇంటో తనిఖీ చేసిన ఏసీబీ అధికారులకు పట్టుబడింది అక్షరాల 93 లక్షల రూపాయల నగదు… 40 తులాల బంగారం. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా… రంగారెడ్డి జిల్లాలోని కేతంపేట తాహసీల్దార్ లావణ్య ఇంట్లోనే.

రెండేళ్ల క్రితం ఉత్తమ తాహసీల్దార్ గా అవార్డు అందుకున్న లావణ్య లంచాలు తీసుకోవడంలోనూ తనదే పైచేయి అని నిరూపించుకున్నారు. ఆన్ లైన్ లో తన పొలాన్ని నమోదు చేయించుకునేందుకు దత్తాయపల్లికి చెందిన రైతు మామిడిపల్లి చెన్నయ్య…. వీఆర్ఓ అనంతయ్యను కలిసారు.

చెన్నయ్యకు తనస్వగ్రామం దత్తాయపల్లిలో 12 ఎకరాల పొలం ఉంది. ఇందులో 9.7 ఎకారాలకు సంబంధించి ఆన్ లైన్ లో నమోదు కాలేదు. దీంతో చెన్నయ్య కుమారుడు భాస్కర్ అంతకు ముందు దత్తాయిపల్లి వీఆర్ఓగా పని చేసిన అనంతయ్యను సంప్రదించారు. అనంతయ్య ఇటీవల బదిలీపై కొందుర్గు వచ్చారు. అనంతయ్య తొమ్మిది ఎకరాలకు 30 వేలు లంచం తీసుకుని ఆన్ లైన్ లో గత నెల 18న రిజిస్ట్రేషన్ చేశారు.

అయితే ఆ తర్వాత 24వ తేదీన దీనిని తొలగించారు. ఈ విషయమై అనంతయ్యను… భాస్కర్ కలిసి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ను తొలగించిన అంశం చెప్పారు. ఈసారి మళ్లీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎకరాకు లక్ష చొప్పున ఇవ్వాలని అనంతయ్య డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పిన భాస్కర్ 8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాని భాస్కర్ మాత్రం ఏసీబీ అధికారులను కలిసి ఈ విషయం పై ఫిర్యాదు చేశారు.

బుధవారం నాడు కొందుర్గులో భాస్కర్ వీఆర్ఓ అనంతయ్యకు నాలుగు లక్షలు అడ్వాన్స్ గా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత అనంతయ్య తాను తీసుకున్న డబ్బు తానొక్కడినే తీసుకోనని, ఇందులో ఐదు లక్షలు కేశంపేట తాహిశీల్దార్ లావణ్యకు ఇవ్వాలని అసలు విషయం చెప్పారు.

దీంతో ఏసీబీ అధికారులు పోమాల్ పల్లి రెవెన్యూ సదస్సులో ఉన్న తాహశీల్దార్ లావణ్యను కలిసి విచారణ ప్రారంభించారు. అయితే తనకూ అనంతయ్య తీసుకున్న లంచానికి సంబంధం లేదని లావణ్య తొలుత చెప్పినా ఏసీబీ అధికారులు మాత్రం తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఉన్న లావణ్య ఇంట్లో సోదాలు చేశారు.

విలాసవంతమైన ఆ ఫ్లాట్ లో ఎక్కడ చూసినా రెండు వేలు, ఐదు వందల నోట్ల కట్టలు కనపడడంతో ఏసీబీ అధికారుల నోట మాట రాలేదు. తహశీల్దార్ లావణ్య ఇంటి నుంచి 93 లక్షల రూపాయల నగదు, 40 తులాల బంగారం, కొన్ని విలువైన ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీఆర్ఓ అనంతయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

First Published:  10 July 2019 9:21 PM GMT
Next Story