Telugu Global
National

ప్రజా ప్రతినిధులను ముంచిన సైబర్ నేరగాడు..!

” పార్టీ అవసరాల నిమిత్తం అత్యవసరంగా పది లక్షలు కావాలి. ఓ మనిషి వస్తాడు. ఆయన చేతికి ఇచ్చి పంపించండి” పార్టీ అధినేత నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకు ఓ ఫోన్. ఈ ఫోన్ కాల్ రావడం ఆలస్యం 10 లక్షల రూపాయలు సిద్ధం చేసి, వచ్చిన మనిషి చేతిలో పెట్టారు విశాఖ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే. ” మీ దగ్గరికి ఓ మనిషి వస్తాడు. అతని చేతికి 15 లక్షలు ఇవ్వండి. […]

ప్రజా ప్రతినిధులను ముంచిన సైబర్ నేరగాడు..!
X

” పార్టీ అవసరాల నిమిత్తం అత్యవసరంగా పది లక్షలు కావాలి. ఓ మనిషి వస్తాడు. ఆయన చేతికి ఇచ్చి పంపించండి” పార్టీ అధినేత నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకు ఓ ఫోన్. ఈ ఫోన్ కాల్ రావడం ఆలస్యం 10 లక్షల రూపాయలు సిద్ధం చేసి, వచ్చిన మనిషి చేతిలో పెట్టారు విశాఖ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే.

” మీ దగ్గరికి ఓ మనిషి వస్తాడు. అతని చేతికి 15 లక్షలు ఇవ్వండి. తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం” ఇది శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్.

పార్టీ అధినేత మాటలు అనుకుని తన దగ్గరకు వచ్చిన మనిషికి 15 లక్షలు ఇచ్చి పంపించారు ఆ ఎమ్మెల్యే. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేయడం, అత్యంత అవసరం అని చెప్పడంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. ఇంతా చేసి ఇదంతా ఓ సైబర్ నేరగాడు చేసిన మోసమని చేతులు కాలిన తర్వాత కానీ తెలుసు కోలేక పోయారు.

ప్రజా ప్రతినిధులను మోసం చేసి వివిధ పార్టీలకు చెందిన అధ్యక్షుల పీఏలు, పిఎస్ ల గొంతుతో మాట్లాడి లక్షలాది రూపాయలు కొట్టేసిన ఆ సైబర్ నేరగాడి పేరు విష్ణుమూర్తి. స్పూఫింగ్ కాల్స్ కు పేరుపొందిన విష్ణుమూర్తి పలు పార్టీల అధ్యక్షుల గొంతుతోను, వారి పిఏలు, పిఎస్ ల గొంతుతో ఫోన్ లు చేసి లక్షల రూపాయలు కొట్టేశారు. బీటెక్ చదువును మధ్యలోనే ఆపేసిన విష్ణుమూర్తి సైబర్ నేరాలు చేయడంలో దిట్ట అని పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాదులోని సీసీఎస్ పోలీసులు విష్ణుమూర్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతను చెప్పిన వివరాలతో సైబర్ పోలీసులకు దిమ్మ తిరుగుతోంది అంటున్నారు. ప్రజా ప్రతినిధులను మోసం చేసి స్పూఫింగ్ కాల్స్ చేసిన తీరు విస్మయానికి గురిచేసిందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

జాతీయ పార్టీల అధ్యక్షులు, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు, వారి పిఏలు, సహాయకుల గొంతులతో ముందుగా రెక్కీ నిర్వహించిన విష్ణుమూర్తి ఎక్కడా అనుమానం రాకుండా ప్రవర్తించారని, దీంతో కొందరు ప్రజా ప్రతినిధులు లక్షల రూపాయలు అతనికి ఇచ్చారని చెబుతున్నారు.

డబ్బులు పోగొట్టుకున్నది ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులే కాదని, మరి కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఈ కాల్స్ మోసంలో పడ్డారని, అయితే ఎక్కడ పరువు పోతుందోనని భయంతో బయట పడడం లేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

First Published:  19 Jun 2019 4:21 AM GMT
Next Story