Telugu Global
NEWS

భారత క్రీడాచరిత్రలోనే సంచలనం

మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్ కు మరో మహిళతో పెళ్లి మహిళను మహిళ జీవితభాగస్వామిని చేసుకోడం తప్పుకాదు 2018లోనే సుప్రీంకోర్టు తీర్పు భారత స్ఫ్రింటర్, మహిళల 100, 200 మీటర్ల పరుగులో ఆసియాక్రీడల సిల్వర్ మెడలిస్ట్ ద్యుతీ చంద్…తన స్నేహితురాలిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించింది. గత మూడేళ్లుగా తాను ఓ యువతితో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. పురుషులు, మహిళలు ప్రకృతికి రెండుకళ్లు లాంటి వారు. యువతిని యువకుడు, పురుషుడిని మహిళ పెళ్లాడటం, జీవితభాగస్వామిగా చేసుకొని పిల్లల్ని […]

భారత క్రీడాచరిత్రలోనే సంచలనం
X
  • మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్ కు మరో మహిళతో పెళ్లి
  • మహిళను మహిళ జీవితభాగస్వామిని చేసుకోడం తప్పుకాదు
  • 2018లోనే సుప్రీంకోర్టు తీర్పు

భారత స్ఫ్రింటర్, మహిళల 100, 200 మీటర్ల పరుగులో ఆసియాక్రీడల సిల్వర్ మెడలిస్ట్ ద్యుతీ చంద్…తన స్నేహితురాలిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించింది. గత మూడేళ్లుగా తాను ఓ యువతితో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది.

పురుషులు, మహిళలు ప్రకృతికి రెండుకళ్లు లాంటి వారు. యువతిని యువకుడు, పురుషుడిని మహిళ పెళ్లాడటం, జీవితభాగస్వామిగా చేసుకొని పిల్లల్ని కనడం యుగాలుగా వస్తున్న ప్రకృతి ధర్మం.

అయితే…పశ్చిమదేశాలలో పురుషుల్ని పురుషులు, మహిళల్ని మహిళలు పెళ్లాడటం, జీవిత భాగస్వాములుగా చేసుకోడం ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది.

న్యూజిలాండ్, సౌతాఫ్రికా దేశాల మహిళా క్రికెటర్లు సాటి మహిళలను పెళ్లాడి తమ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పాశ్చాత్య దేశాలలో ప్రారంభమై…భారత్ కూ వ్యాపించిన ఈ వింత బంధాలు, చిత్రమైన పెళ్లిళ్లకు గత ఏడాది సెప్టెంబర్ లోనే… సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.

తొలి భారత మహిళ ద్యుతీ చంద్…

ద్యుతీ చంద్…ఆసియా క్రీడల మహిళల 100, 200 మీటర్ల పరుగులో భారత్ కు రెండు రజతపతకాలు అందించిన అథ్లెట్. చకా గోపాల్ పూర్ లోని ఓ నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టి… ఎన్నో అవమానాలు, కష్టనష్టాలు భరించి అంతర్జాతీయ రన్నర్ గా ఎదిగిన ద్యుతీ చంద్…గత మూడేళ్లుగా ఓ యువతితో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే తన జీవితభాగస్వామిని చేసుకోనున్నట్లు తెలిపింది.

తన ఉన్నతిలో అమ్మానాన్నల పాత్ర ఎంత ఉందో.. తన స్నేహితురాలు పాత్ర అంతే ఉందని…తనతో కలసి బయటకు రావటానికి, పోటీలకు హాజరుకావడానికి ఏమాత్రం ఇష్టపడదని…. ఆమె పేరును బయటపెట్టడం కూడా తనకు ఏమాత్రం ఇష్టం లేదని ద్యుతీ చెప్పింది.

తన విజయాల కోసం స్నేహితురాలు దైవాన్ని వేడుకొంటూ ఉంటుందని…బాల్యం నుంచి తాను పడిన కష్టాలు, ఎదుర్కొన్న పరీక్షల గురించి ఆమెకు తెలుసునని వివరించింది.

సుప్రీంకోర్టు తీర్పే బలం…

దేశసర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది వెలువరించిన తీర్పుతో తనకు ఆత్మస్థైర్యం పెరిగిందని… తన మనసులోని విషయాన్ని ధైర్యంగా బయటపెట్టానని తెలిపింది.

అయితే ..ఈ సంగతి తన తల్లిదండ్రులకు తెలియదని…త్వరలోనే వారి ఆమోదంతో జీవితభాగస్వామిగా చేసుకొంటానని ధీమాగా చెప్పింది.

వివాహం, జీవితభాగస్వామి లాంటి అంశాలు తన వ్యక్తిగతమని…సమాజానికి ఏమాత్రం సంబంధం లేదని ద్యుతీ తేల్చి చెప్పింది.
త్వరలో జరిగే టోక్యో క్రీడల కోసం హైదరాబాద్ లో ప్రస్తుతం ద్యుతీ చంద్ శిక్షణ పొందుతోంది.

సాంప్రదాయాలు, కట్టుబాట్లకు, వేదకాలం నాటి చరిత్రకు ప్రతీకగా నిలిచే భారత సామాజిక వ్యవస్థలో సాటిమహిళను పెళ్లాడిన మహిళగా ద్యుతీ చంద్ నిలిచిపోనుంది.

First Published:  19 May 2019 11:38 PM GMT
Next Story