Telugu Global
NEWS

సమీక్షలు లేనిదే.... ఆయనకు నిద్రపట్టదట

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు. ఇది ఎంకి పాటల్లోని ఓ పాటలో వచ్చే చరణం. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అచ్చంగా సరిపోతుందని అంటున్నారు. దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి. సీనియర్ నాయకులు ఎందరో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఆయా రాష్ట్రాలలోనూ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కానీ, ఏపీ సీఎం చంద్రబాబులాగా మాత్రం ఎవ్వరూ మాట్లాడడం లేదు. తానేం మాట్లాడుతున్నారో తెలియనంతగా […]

సమీక్షలు లేనిదే.... ఆయనకు నిద్రపట్టదట
X

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు. ఇది ఎంకి పాటల్లోని ఓ పాటలో వచ్చే చరణం. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అచ్చంగా సరిపోతుందని అంటున్నారు.

దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి. సీనియర్ నాయకులు ఎందరో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఆయా రాష్ట్రాలలోనూ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కానీ, ఏపీ సీఎం చంద్రబాబులాగా మాత్రం ఎవ్వరూ మాట్లాడడం లేదు. తానేం మాట్లాడుతున్నారో తెలియనంతగా ఆయన మాట్లాడుతున్నారు. దీంతో అధికారులు ఎప్పుడో చంద్రబాబు మాటలు పట్టించుకోవడం మానేశారని అంటున్నారు.

తాను సమీక్షలు చేయకపోతే మనుషుల ప్రాణాలు పోతున్నాయని, రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లుతోందని సీఎం మాటిమాటికి చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. రాజకీయాలలో సుదీర్ఘ కాలంగా ఉన్న ఒక సీనియర్ నాయకుడి నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యానాలు రావడం వాంఛనీయం కాదంటున్నారు.

చంద్రబాబు తీరు మాత్రం ’నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు‘ అన్న చందంగా ఉందని పేర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది.. అప్పటి వరకు రాష్టానికి కావలసిన రోజువారీ పనులను సీఎస్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, వారి మీద కూడా నిందలు వేయడం సరి కాదంటున్నారు.

నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకుంటున్న చర్యలు బహుశా చంద్రబాబుకు మింగుడు పడడం లేదేమోనని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అధికారులే పూర్తి బాధ్యతలను తీసుకుంటారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే.. దీనిని చంద్రబాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో తెలియడం లేదంటున్నారు ఐఏఎస్ అధికారులు.

సీఎం తీరు మీద వైసీసీ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. ఫలితాలు వచ్చేదాక కూడా వేచి చూడనంత పరిస్థతి చంద్రబాబులో కనిపిస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు కూడా చంద్రబాబు తీరు మీద విస్మయం వ్యక్తం చేస్తున్నారన్న మాటలూ వినిపిస్తున్నాయి.

కొసమెరుపు ఏమిటంటే… సమీక్షలు లేకుండా నిద్రపోని చంద్రబాబు ఎన్నికల సరళి మీద మళ్లీ లోతైన సమీక్షలు జరుపుతారట. తాము రహస్యంగా, అత్యంత పకడ్బందీగా జరుపుకున్న సర్వే కూడా టీడీపీకి నిరాశాజనకమైన ఫలితాలు ఉంటాయని తేల్చి చెప్పిందట. ఇదే ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.

First Published:  26 April 2019 11:24 PM GMT
Next Story