Telugu Global
NEWS

ప్రణయ్ హత్యకేసులో నిందితులకు బెయిల్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఒక ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యలో ప్రధాన నిందితుడు ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతీరావు. కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే అక్కసుతోనే ఈ హత్యను చేయించినట్లు మారుతీ రావు కూడా పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఈ హత్యకేసులో […]

ప్రణయ్ హత్యకేసులో నిందితులకు బెయిల్
X

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఒక ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యలో ప్రధాన నిందితుడు ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతీరావు.

కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే అక్కసుతోనే ఈ హత్యను చేయించినట్లు మారుతీ రావు కూడా పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు కాగా ఆరవ నిందితుడు అతని సోదరుడు శ్రవణ్, ఐదో నిందితుడు కరీం లకు శుక్రవారం నాడు బెయిల్ మంజూరైంది. నల్లగొండ జిల్లా పోలీసులు వీరి ముగ్గురిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. హత్య జరిగిన నాటి నుంచి చర్లపల్లి జైల్లో ఉంటున్న వీరు ఎప్పటికప్పుడు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు.

కాగా, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. దీంతో నిన్న మరో సారి హైకోర్టును ఆశ్రయించగా వారికి బెయిల్ లభించింది. అయితే ఈ బెయిల్ ను రద్దు చేయమని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళతామని జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పారు.

తండ్రికి బెయిల్ వచ్చిన విషయం తెలుసుకున్న అమృత సోషల్ మీడియాలో స్పందించింది. నా బాధను ఎవరూ అర్థం చేసుకోవట్లేదని…. దేవుడు నిజం వైపే నిలుస్తాడనే నమ్మకం ఉందంటూ ట్వీట్ చేసింది.

First Published:  27 April 2019 12:37 AM GMT
Next Story