Telugu Global
NEWS

తరలింపు కోసం "పచ్చ" కట్టలు !

“తెలంగాణలో సెటిలర్ల ఓట్లు మనమే వేయించుకోవాలి. అక్కడున్న వారందరినీ వారి వారి గ్రామాలకు తరలించే బాధ్యత ఆ నియోజకవర్గాల వారిదే. వారికి ఏం కావాలంటే అవి ఇవ్వండి” అంటూ పచ్చ పార్టీ అధిష్టానం హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు. గతంలో తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్ లోను కూడా రెండేసి ఓట్లు ఉన్న వారు అక్కడ ఎన్నికల్లోను, ఇక్కడి ఎన్నికల్లోను కూడా పాల్గొనే వారు. అయితే, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోను ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ […]

తరలింపు కోసం పచ్చ కట్టలు !
X

“తెలంగాణలో సెటిలర్ల ఓట్లు మనమే వేయించుకోవాలి. అక్కడున్న వారందరినీ వారి వారి గ్రామాలకు తరలించే బాధ్యత ఆ నియోజకవర్గాల వారిదే. వారికి ఏం కావాలంటే అవి ఇవ్వండి” అంటూ పచ్చ పార్టీ అధిష్టానం హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు.

గతంలో తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్ లోను కూడా రెండేసి ఓట్లు ఉన్న వారు అక్కడ ఎన్నికల్లోను, ఇక్కడి ఎన్నికల్లోను కూడా పాల్గొనే వారు. అయితే, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోను ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ను కోరడంతో ఈసారి ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున నిర్వహిస్తున్నారు.

దీంతో పచ్చ పార్టీ ఇక్కడి నుంచి ఓటర్లను తరలించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.

హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లో సెటిలర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ అనేక ఆశలు చూపి వారి నియోజక వర్గాలకు తరలించాలన్నది పచ్చ పార్టీ నాయకుల ప్లాన్ గా చెబుతున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ఓటర్లకు టిక్కెట్ ఛార్జీలు ఇవ్వడంతో పాటు భోజనం, మందు, ఆపై ఓటుకు ఇంత అని లెక్కకట్టి మరీ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.

సెటిలర్ల ఓట్లు కోసం “పచ్చ” నోట్ల కట్టలు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఒక్కో ఏరియాకు, గ్రామానికి, కాలనీకి ఒక్కో బస్సు లేదా రెండు బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్నారు.

కొందరు ఓటర్లు స్వచ్చంధంగా తమ గ్రామాలకు వెళ్లాలని భావించినా… అలాంటి వారిని కూడా ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్నుకునేలా కొందరు నాయకులు తమ ప్రయత్నాలను ప్రారంభించినట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం పోలింగ్ సమయానికి తెలంగాణలో ఉన్న సెటిలర్లను వీలైనంత మందిని తరలించాలనే ఆలోచనలో పచ్చ పార్టీకి చెందిన వారు ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ నుంచి వందలాది బస్సులు, ప్రైవేట్ బస్సులు, కార్లు, రైళ్లలో ఏపీ ఓటర్లను తరలించే పనిని సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారంటున్నారు. తెలంగాణలో ఉన్న సెటిలర్లను తరలించేందుకు ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు.

First Published:  9 April 2019 9:25 PM GMT
Next Story