Telugu Global
NEWS

ఈసారికి లీకుల్నే.... మ్యానిఫెస్టో అనుకోండి !

మేనిఫెస్టో., ఏ రాజకీయ పార్టీకి అయినా భగవద్గీత… బైబిల్… ఖురాన్. అంతటి విశిష్టమైన, పవిత్రమైన స్థానం ఉంది మేనిఫెస్టోకి. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో… ఏమేమి ఇస్తామో చెప్పే ప్రమాణ పత్రం మేనిఫెస్టో. అంత విశిష్టత ఉంది కాబట్టే ఎన్నికలకు ముందు ప్రజలు ఏ పార్టీ విడుదల చేసే కోసం ఎదురు చూస్తారు. అలాంటి మేనిఫెస్టోను కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ లీకుల కథనాలుగానే మార్చేసింది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో […]

ఈసారికి లీకుల్నే.... మ్యానిఫెస్టో అనుకోండి !
X

మేనిఫెస్టో., ఏ రాజకీయ పార్టీకి అయినా భగవద్గీత… బైబిల్… ఖురాన్. అంతటి విశిష్టమైన, పవిత్రమైన స్థానం ఉంది మేనిఫెస్టోకి. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో… ఏమేమి ఇస్తామో చెప్పే ప్రమాణ పత్రం మేనిఫెస్టో. అంత విశిష్టత ఉంది కాబట్టే ఎన్నికలకు ముందు ప్రజలు ఏ పార్టీ విడుదల చేసే కోసం ఎదురు చూస్తారు.

అలాంటి మేనిఫెస్టోను కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ లీకుల కథనాలుగానే మార్చేసింది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ లోక్ సభ ఎన్నికలకు ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజలకు తాము ఏం చేయాలనుకుంటున్నారో… ఏమి చేద్దామనుకుంటున్నారో ఆ మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంది.

అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. నెల రోజుల క్రితమే మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ కమిటీ ఇచ్చే నివేదిక గురించి మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. మ్యానిఫెస్టోలు విడుదల చేసి దానిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన తెలుగుదేశం పార్టీ లీకుల ద్వారా తాము ఏం చేస్తామో పచ్చ మీడియా కు చెబుతోంది అంటున్నారు.

18 సంవత్సరాలు దాటిన వారికి నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఒకరోజు…. ఇళ్ళ పై ఉన్న రుణాలను పూర్తిగా తొలగిస్తామంటూ మరొక రోజు… వృద్ధులకు పింఛన్ల తో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇంకొక రోజు… విద్యార్థులకు అది చేస్తాం… ఇది చేస్తాం..అంటూ మరొక రోజు మీడియాలో కథనాలు రాయించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.

ఇవన్నీ మేనిఫెస్టోలో ప్రకటించాల్సి ఉన్నా అలా చేయకుండా రోజుకొకటి వంతున పత్రికలకు ఉప్పు అందిస్తున్నారని చెబుతున్నారు. ఇక ప్రతి రోజు పచ్చ మీడియాకు “విశ్వసనీయవర్గాలు చెప్పాయి” అనే పేరుతో కథనాలు రాయించుకుంటున్నారని విమర్శలొస్తున్నాయి.

ఇలా కథనాలు రాయించుకోవడం వెనుక ఓ కుట్ర దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరిస్తే అధికారంలోకి రావడం అంటూ జరిగితే వీటిపై ప్రజల నిలదీస్తారని భయం తెలుగుదేశం నాయకుల్లో పెరిగిందని, అందుకే మేనిఫెస్టో ఊసెత్తకుండా విశ్వసనీయవర్గాల కథనం పేరుతో పచ్చ మీడియాలో వార్తలు రాయించుకున్నారు అని అంటున్నారు.

ఇప్పటికే రాజకీయ పార్టీగా అన్ని విలువలకు తిలోదకాలిచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈసారి మేనిఫెస్టో ప్రమాణ పత్రానికి కూడా తిలోదకాలు ఇచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

First Published:  3 April 2019 12:08 AM GMT
Next Story