Telugu Global
NEWS

వారసులను బరిలో దింపి.... త్యాగం అంటారేంటి బాబు!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా అది లోక కళ్యాణం కోసం అన్నట్లుగా ప్రచారం చేయడంలో ఎల్లో మీడియా ముందుంటుంది. చంద్రబాబు చేసిన ప్రతీ పని మహత్తరమైనదిగా పేర్కొంటూ వరుసగా కథనాలు రాయడమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా. ఈ ప్రచారంలో భాగంగా రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న సీనియర్లను త్యాగధనులుగా పేర్కొంటూ కథనాలు  ప్రచురిస్తున్నారు. ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకున్న వారంతా పార్టీ […]

వారసులను బరిలో దింపి.... త్యాగం అంటారేంటి బాబు!
X

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా అది లోక కళ్యాణం కోసం అన్నట్లుగా ప్రచారం చేయడంలో ఎల్లో మీడియా ముందుంటుంది. చంద్రబాబు చేసిన ప్రతీ పని మహత్తరమైనదిగా పేర్కొంటూ వరుసగా కథనాలు రాయడమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా.

ఈ ప్రచారంలో భాగంగా రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న సీనియర్లను త్యాగధనులుగా పేర్కొంటూ కథనాలు ప్రచురిస్తున్నారు. ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకున్న వారంతా పార్టీ కోసం, ప్రజల కోసం త్యాగం చేశారు అంటూ వేనోళ్ల పొగుడుతోంది ఎల్లో మీడియా.

అయితే వాస్తవానికి ఇలా పోటీ నుంచి తప్పుకున్న వారంతా వారి వారసులను ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. త్యాగం చేశారని పేర్కొన్న వారందరి కొడుకులు, కూతుళ్లు రానున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న వారే.

రాజమహేంద్రవరం లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేయనని ఎంపీ మురళీ మోహన్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయన స్థానంలో మురళీమోహన్ కోడలు మాగంటి రూపకు ఇచ్చింది.

అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి కూడా త్యాగధనుల లిస్టులో ఉన్నారు. ఆయన కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి అనంతపురం స్థానాన్ని కేటాయించారు చంద్రబాబు నాయుడు.

అదే జిల్లాకు చెందిన పరిటాల సునీతను తప్పించి ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ కు టిక్కెట్ ఇచ్చారు.

కర్నూలు జిల్లాకు చెందిన టీ.జి. వెంకటేష్ స్థానంలో ఆయన కుమారుడు టీ.జి. భరత్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీ.జి.వెంకటేష్ త్యాగం చేసారంటూ కథనాలు రాశారు.

శ్రీకాకుళం జిల్లాలో గౌతు శ్యామ సుందర శివాజీకి టిక్కట్ ఇవ్వకుండా ఆయన కుమార్తె గౌతు శిరీష ను బరిలోకి దింపారు చంద్రబాబు నాయుడు.

విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి మృణాళినికి టిక్కెట్ ఇవ్వకుండా ఆమె కుమారుడు నాగార్జునను అభ్యర్ధిగా ప్రకటించారు.

విజయవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్థానంలో ఆయన కుమార్తె, ఎన్ఆర్ఐ షబానా ఖతూన్ కు టికెట్ ఇచ్చారు.

కర్నూలు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి కూడా ఈసారి పోటీ చేయడం లేదని పచ్చ మీడియా కథనాలు ప్రచురించింది. అయితే ఆయన స్థానంలో కె. ఈ. శ్యాంబాబు కు టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో దింపారు చంద్రబాబు.

తామే పోటీ నుంచి తప్పుకుని త్యాగధనులమంటూ కథనాలు రాయించుకున్న వారందరూ వాస్తవంలో మాత్రం తమ వారసులకు టికెట్ ఇప్పించుకున్నారు. పచ్చ మీడియా కూడా వాస్తవాలను పక్కన పడేసి ఎన్నికల బరిలో లేని సీనియర్లను గొప్ప త్యాగం చేశారు అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. మీడియా చేతిలో ఉన్నంత వరకు ఇలాంటివి ఎన్ని చేసినా చెల్లుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  21 March 2019 8:57 PM GMT
Next Story