Telugu Global
NEWS

ఈ ఎంపీకి అన్నిదార్లు మూసుకుపోతున్నాయి !

కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం వేడెక్కుతోంది. మిగతా ప్రాంతాల్లో కంటే నంద్యాలలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. దీంతో ఆయన సైకిల్‌ పార్టీ నుంచి బయటకు వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 10న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారట. దీంతో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ ఎస్పీవైరెడ్డి పార్టీ మారాలని ఎందుకు […]

ఈ ఎంపీకి అన్నిదార్లు మూసుకుపోతున్నాయి !
X

కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం వేడెక్కుతోంది. మిగతా ప్రాంతాల్లో కంటే నంద్యాలలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. దీంతో ఆయన సైకిల్‌ పార్టీ నుంచి బయటకు వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే ఈనెల 10న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారట. దీంతో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ ఎస్పీవైరెడ్డి పార్టీ మారాలని ఎందుకు అనుకుంటున్నారు..? ఆయనకు వచ్చిన ఇబ్బందేమిటి..?

2014 ఎన్నికల్లో ఎస్పీవైరెడ్డి వైసీపీ నుంచి నంద్యాల ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత టీడీపీ కండువా కప్పుకొన్నారు. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఆయన నంద్యాల ఎంపీ, లేదా ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని అధిష్టానాన్ని ఇప్పటికే కోరారట. తనకు కేటాయించకపోతే తన అల్లుడుకు గానీ, లేదా కుమార్తెకు గాని ఇక్కడి నుంచి టికెట్‌ ఇవ్వాలన్నారట. కానీ బ్యాక్‌ గ్రౌండ్ లో మాత్రం ఎస్పీవై రెడ్డికి చెక్‌పెట్టే పరిణామాలు ఇప్పటికే జరిగిపోయాయని ప్రచారం జరుగుతోంది.

టీడీపీ నందికొట్కూర్‌ ఇన్‌చార్జిగా ఉన్న శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డి బావ, బామ్మర్దులు, వారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. గౌరు ఫ్యామిలీని టీడీపీలోకి తీసుకు రావడంలో శివానందరెడ్డి కీలక పాత్ర పోషించారట. దీంతో గౌరు చరితకు పాణ్యం టికెట్‌, శివానందరెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్‌ ఇవ్వాలని అడుగుతున్నారట. ఇందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. దీంతో ఎస్పీవైరెడ్డికి టికెట్‌ ఆశలు లేనట్లేనని చెప్పుకుంటున్నారు. అయితే నంద్యాల ఎమ్మెల్యే టికెట్‌ అయినా ఇవ్వాలని పార్టీని కోరారట.

కాని నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భూమా బ్రహ్మనందరెడ్డి గెలిచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే హోదాలో బ్రహ్మానందరెడ్డి మరోసారి పోటికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి సైతం నంద్యాల టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య టికెట్‌ వార్ సాగుతుండగా.. ఎస్పీ వైరెడ్డికి అవకాశం లేనట్లయిందనే చర్చ జోరుగా సాగుతోంది.

అయితే ఎస్పీ వైరెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారంలో…. ఏ పార్టీలోకి వెళ్తారనే ప్రశ్న అందరిలో మొదలైంది. వైసీపీ ఎంపీగా గెలిచిన ఆయన మరోసారి వైసీపీ వైపు చూడాలనుకున్నా అక్కడి పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి వైసీపీలోకి చేరిన బోజ బ్రహ్మానందరెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్‌ ఖాయం చేసే పనిలో ఉన్నారట జగన్‌.

మరోవైపు శిల్పా మోహన్‌రెడ్డి కూడా నంద్యాల ఎంపీ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయతిస్తున్నారట. దీంతో ఎస్పీవై రెడ్డికి ఫ్యాన్‌ పార్టీలోనూ ఎదరుగాలి ఉండే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన ఎస్పీవై రెడ్డి ఆ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారట.

First Published:  8 March 2019 12:31 AM GMT
Next Story