Telugu Global
NEWS

వీరే "దేశం" ఎమ్మెల్సీలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ  పార్టీ శాసనమండలి అభ్యర్ధులను ఖరారు చేశారు. అందరూ నిదురించిన వేళ…. ఏడుగురు అభ్యర్ధులను ఎమ్మెల్సీలుగా ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు. గురువారం బాగా పొద్దుపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక్కరే ఈ వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్లను కూడా సంప్రదించకుండా తనదైన శైలిలో అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాతో పాటు స్ధానిక సంస్థల కోటా కింద కూడా ఏడుగురు అభ్యర్ధులను […]

వీరే దేశం ఎమ్మెల్సీలు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ శాసనమండలి అభ్యర్ధులను ఖరారు చేశారు. అందరూ నిదురించిన వేళ…. ఏడుగురు అభ్యర్ధులను ఎమ్మెల్సీలుగా ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు.

గురువారం బాగా పొద్దుపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక్కరే ఈ వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్లను కూడా సంప్రదించకుండా తనదైన శైలిలో అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాతో పాటు స్ధానిక సంస్థల కోటా కింద కూడా ఏడుగురు అభ్యర్ధులను ఎంపిక చేశారు చంద్రబాబు నాయుడు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీల గర్జనతో కంగుతిన్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీల ఎంపికలో బీసీల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఎమ్మెల్సీల ఎంపికను బట్టి చూస్తే తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు నిర్ణయించిన ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులలో నలుగురు బీసీ కులాలకు చెందిన వారు ఉండడం విశేషం. వీరు కూడా రజక, బోయ, గవర, యాదవ కులాలకు చెందిన వారు కావడం గమనార్హం.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఏడుగురు ఎమ్మెల్సీలలో ఇద్దరు పాత వారికే తిరిగి అవకాశం దక్కింది. వారిలో యనమల రామక్రిష్ణుడు, శమంతకమణిలకు తిరిగి మరోసారి అవకాశం కల్పించారు. వీరిలో యనమల రామక్రిష్ణుడు ఎమ్మెల్యే కోటాలోను, శమంతకమణి గవర్నర్ కోటాలోను ఎమ్మెల్సీలుగా ఎంపికవుతారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్ధానంలో గవర్నర్ కోటాలో శమంతకమణికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు.

అలాగే ఎస్సీ, మహిళ, రాయలసీమ కోటాలను కూడా శమంతకమణితో భర్తీ చేసినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో యనమల రామక్రిష్ణుడు, దువ్వారపు రామారావు, ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు, బీ.టీ.రామారావులను ఎంపిక చేశారు. వీరిలో బీ.టీ.రామారావు బీసీ బోయ కులానికి చెందిన వారు. ఇక అశోక్ బాబు ఉద్యోగ సంఘాల కోటాలో ఎంపికయ్యారు. గవర్నర్ కోటాలో శివనాథరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఈయన రామసుబ్బారెడ్డి స్ధానంలో ఎంపికయ్యారు.

ఇక ఇటీవలే మరణించిన ఎం.వీ.ఎస్. మూర్తి స్థానాన్ని బుద్ధా నాగశివ జగదీశ్వర రావుతో భర్తీ చేశారు. ఈయన స్ధానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. సామాజిక వర్గాల సమీకరణాన్ని పాటించినట్లుగా పార్టీ చెబుతోంది. అయితే ఈసారి ఎమ్మెల్సీ పదవి ఖాయం అని ఆశలు పెట్టుకున్న కొందరు నాయకులకు మాత్రం నిరాశే ఎదురైందంటున్నారు.

First Published:  27 Feb 2019 9:24 PM GMT
Next Story