Telugu Global
NEWS

కోడి పందాల్లో గెలిచారు.... కాని వచ్చినవి నకిలీ నోట్లని తెలుసుకొని....!

సంక్రాంతి అంటే కోస్తాంధ్రలో గుర్తొచ్చేది కోడి పందాలే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పందెంరాయుళ్లు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జరిగే పందేలకు వెళ్తుంటారు. అయితే అక్కడ కోడిపందేలు జరిగే సమయంలో పోలీసుల నిఘా ఉంటుంది కనుక పందేలు కాసి డబ్బుల మార్పిడి జరిగేది అంతా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. అలాగే పేకట, మట్కా తదితర గ్యాంబ్లింగ్ ఆటల సమయంలో కూడా డబ్బు మార్పిడి అంతా గోప్యంగా ఆదరాబాదరాగా జరుగుతుంది. సరిగ్గా ఈ తొందరపాటు, […]

కోడి పందాల్లో గెలిచారు.... కాని వచ్చినవి నకిలీ నోట్లని తెలుసుకొని....!
X

సంక్రాంతి అంటే కోస్తాంధ్రలో గుర్తొచ్చేది కోడి పందాలే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పందెంరాయుళ్లు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జరిగే పందేలకు వెళ్తుంటారు. అయితే అక్కడ కోడిపందేలు జరిగే సమయంలో పోలీసుల నిఘా ఉంటుంది కనుక పందేలు కాసి డబ్బుల మార్పిడి జరిగేది అంతా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. అలాగే పేకట, మట్కా తదితర గ్యాంబ్లింగ్ ఆటల సమయంలో కూడా డబ్బు మార్పిడి అంతా గోప్యంగా ఆదరాబాదరాగా జరుగుతుంది.

సరిగ్గా ఈ తొందరపాటు, గోప్యతను నకిలీ నోట్ల చలామణి దారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పందెం పెట్టి గెలిచిన వాళ్లకు భారీగా నకిలీ నోట్లు అంటగట్టారు. దీనికి సంబంధించి పలు ఘటనలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

కృష్ణా జిల్లా వణుకూరు గ్రామానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్ సంక్రాంతి సమయంలో కోడి పందేల కోసం కంకిపాడు మండలానికి వెళ్లాడు. అక్కడ కోడి పందేల్లో దాదాపు 15వేల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ డబ్బును బ్యాంకులో జమ చేయడానికి వెళ్లగా దాదాపు 10 వేల రూపాయలు నకిలీ నోట్లుగా బ్యాంకు అధికారులు గుర్తించారు. వీటిలో నకిలీ నోట్లు ఎక్కువగా 500, 2000 రూపాయల నోట్లే కావడం గమనార్హం. అసలే నకిలీ నోట్లు.. గెలిచింది కోడి పందేల్లో కాబట్టి పోలీసులకు కూడా పిర్యాదు చేయలేదు.

పందెం సమయంలో నిర్వాహకులు ఆదరాబాదరాగా గెలిచిన డబ్బులు ఇచ్చారని.. ఆ సమయంలో అవి నకిలీవా అసలువా అని గుర్తించలేదని శ్రీనివాస్ వాపోయాడు. భీమవరానికి చెందిన జి.సుబ్బరాజుకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

ఇలాంటి ప్రదేశాల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న వ్యక్తులను కంచికచర్ల పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ నోట్ల ముఠాను కూడా చిలకలూరిపేట పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వీరు గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జరిగిన చోట నకిలీ నోట్లను విస్తృతంగా చెలామణిలోకి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  28 Jan 2019 1:45 AM GMT
Next Story