Telugu Global
Family

రాముడు

ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అవును మరి, రాముడు నీలమేఘ శ్యాముడు కదా? అందుకే అందాల రాముడన్నారు. కౌసల్య తనయుడు గనుక కౌసల్య రాముడన్నారు. దశరధ పుత్రుడు గనుక దశరధ రాముడన్నారు. సీతను పెండ్లాడాడు గనుక సీతారాముడన్నారు. జగానికంతా ఆదర్శపురుషుడు గనుక జగదభిరాముడన్నారు. అంతేనా? ‘రాముడు మంచి బాలుడు’గా ఎప్పటికీ చెప్పుకుంటాం. ఎందుకూ? రామునికి ఒకటే మాట. ఒకటే బాణం. మాట తప్పని మంచితనానికి రాముడు […]

రాముడు
X

ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేవుడు

అవును మరి, రాముడు నీలమేఘ శ్యాముడు కదా? అందుకే అందాల రాముడన్నారు. కౌసల్య తనయుడు గనుక కౌసల్య రాముడన్నారు. దశరధ పుత్రుడు గనుక దశరధ రాముడన్నారు. సీతను పెండ్లాడాడు గనుక సీతారాముడన్నారు. జగానికంతా ఆదర్శపురుషుడు గనుక జగదభిరాముడన్నారు. అంతేనా? ‘రాముడు మంచి బాలుడు’గా ఎప్పటికీ చెప్పుకుంటాం. ఎందుకూ? రామునికి ఒకటే మాట. ఒకటే బాణం. మాట తప్పని మంచితనానికి రాముడు నిలువెత్తు నిదర్శనం!

తండ్రి మాటకై తాను అడవులకుపోయాడు. భరతుడు వచ్చి తిరిగి రాజ్యానికి రమ్మని, ఏలుకొమ్మని కోరాడు. కాని కాదన్న రాముడు సతీసమేతంగా పద్నాలుగేళ్ళు అరణ్యవాసాన్ని అనుభవించడానికే నిర్ణయించుకున్నాడు.

రాముడు బాల్యంలోనే రాక్షస బాధ నివారించడానికి విశ్వామిత్రుని వెంట వెళ్ళాడు. అదికూడా తండ్రి యిచ్చిన మాట కోసమే. మారీచ, సుబాహువులనే రాక్షసులను యింకా తాటకి అనే రాక్షసిని సంహరించి విశ్వామిత్రునికి ప్రీతిపాత్రమయినాడు. రాముడు అంతటి మహానుభావుడు గనుకనే ఆయన పాదం తగిలి రాయి అహల్య అయింది.

ఎవ్వరూ కదపనైనా కదపలేని శివధనస్సును ఎక్కుపెట్టి విరిచి సీతను పెళ్ళాడాడు. తరువాత అయోధ్యకు బయలుదేరుతుండగా ఆగ్రహంతో వచ్చిన పరశురాముని అహంకారాన్ని అణచి వేసాడు. అతని తేజమే రామునికి వచ్చింది.

అరణ్య వాసాన వున్న సీతను మాయచేత రావణుడు తీసుకుపోవడం మీకు తెలిసిందే. సీతను వెతుక్కుంటూ సామాన్యునివలె అన్ని బాధల్ని అనుభవించాడు.

సుగ్రీవునికిచ్చిన మాటకోసం వాలిని సంహరించినా సుగ్రీవునికి పట్టాభిషేకం చేసినా వాలి కుమారుడు అంగదుని యువరాజుని చేసాడు. మాటయిచ్చినందువల్ల చేసిన తప్పుకు మరో జన్మలో శ్రీకృష్ణావతారంలో అదే అంగదుని బాణానికి గాయపడి చివరాఖరికి దాని వల్లే తనువు చాలించాడు.

రావణుని సంహరించి సీతను తెచ్చుకున్నా లోకుల నిందకు, మాటకు విలువిచ్చి ప్రాణ ప్రదమైన సీతను అడవులకు పంపాడు. సీత కథను వినిపించిన లవకుశులు తన పిల్లలేనని తెలిసి తనవల్ల సీతకొచ్చిన కష్టాలకు యెంతో దుఃఖించాడు. మాటకోసమే మసులుకున్న మనిషిగా రాముని కథంతా చెప్పనే చెబుతుంది.

అందుకే రాముడు లక్ష్మణునికే కాదు, ఆంజనేయునికే కాదు… అందరికీ మనందరికీ ఆదర్శమై ఆ చంద్ర తారార్కమై నిలిచాడు. మనిషిగా గెలిచి దేవుడైనాడు!.

-బమ్మిడి జగదీశ్వర రావు

First Published:  25 Oct 2018 2:54 AM GMT
Next Story