Telugu Global
NEWS

స్పీకర్ కోడెలకు చుక్కెదురు

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల అక్రమాల కేసులో హైకోర్టులో స్పీకర్‌కు చుక్కెదురైంది. ఈనెల 10న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్‌ ఎన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడెల చేసిన సంచలన వ్యాఖ్యలే ఆయన అసలు గుట్టును బయటపెట్టాయి. చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన స్పీకర్ కోడెల…. 2014 ఎన్నికల్లో తాను గెలవడానికి 11 కోట్ల 50లక్షలు ఖర్చు పెట్టానని కెమెరాల సాక్షిగా ప్రకటించారు. అలా ఖర్చు పెట్టడం […]

స్పీకర్ కోడెలకు చుక్కెదురు
X

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల అక్రమాల కేసులో హైకోర్టులో స్పీకర్‌కు చుక్కెదురైంది. ఈనెల 10న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్‌ ఎన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడెల చేసిన సంచలన వ్యాఖ్యలే ఆయన అసలు గుట్టును బయటపెట్టాయి. చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన స్పీకర్ కోడెల…. 2014 ఎన్నికల్లో తాను గెలవడానికి 11 కోట్ల 50లక్షలు ఖర్చు పెట్టానని కెమెరాల సాక్షిగా ప్రకటించారు.

అలా ఖర్చు పెట్టడం వల్లే తన గెలుపు సాధ్యమైందని చెప్పారు. స్పీకరే నేరుగా ఇలా చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. నిజానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి ఎన్నికల్లో ఈసీ నిబంధనల ప్రకారం కేవలం 28లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి. కానీ కోడెల మాత్రం గర్వంగా తాను 11.5 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు. దీంతో అంబటి రాంబాబు ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ అటు నుంచి ఎలాంటి చర్యలు లేవు. ఈ అంశంపై సింగిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అనే వ్యక్తి కరీంనగర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఏపీ స్పీకర్ ఖర్చు పెట్టిన 11.5 కోట్లపై ఐటీ శాఖతో విచారణ జరిపించాలని… ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందున చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కోడెల హైకోర్టును ఆశ్రయించి కరీంనగర్ కోర్టుకు హాజరుకాకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ స్టే గడువు గత నెల 27తో ముగిసింది. మరోసారి కోర్టును ఆశ్రయించగా… హైకోర్టు స్టే పొడిగించలేదు. ఎన్నికల అక్రమాల వ్యవహారంలో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. చూడాలి ఈసారైనా కోడెల శివప్రసాదరావు కోర్టుకు వస్తారో లేదంటే తమ నాయకుడి బాటలో మరోసారి పై కోర్టులకు వెళ్లి పంతం నెగ్గించుకుంటారో.

First Published:  4 Oct 2018 2:32 AM GMT
Next Story