రుణమాఫీపై కాంగ్రెస్ వ్యూహాత్మక దాడి!
రుణమాఫీపై కాంగ్రెస్ అప్పుడే వ్యూహాత్మక దాడి మొదలు పెట్టింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రుణమాఫీ విషయంలో కేసీఆర్ సర్కారు విఫలమైందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. మొన్న జీఎస్టీ సమావేశాల కోసం కేవలం ఒకరోజే అసెంబ్లీ సమావేశమైంది. ఈ సమయంలో ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. మరిన్ని రోజులు జరపాలని డిమాండ్ చేశాయి. ఉద్యోగాల ప్రకటన, నిరుద్యోగ సమస్య, తాగునీటి పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, వాటి రీడిజైనింగ్ ఇలా.. చర్చించాల్సిన […]
BY sarvi8 Sep 2016 9:00 PM GMT
X
sarvi Updated On: 8 Sep 2016 11:25 PM GMT
రుణమాఫీపై కాంగ్రెస్ అప్పుడే వ్యూహాత్మక దాడి మొదలు పెట్టింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రుణమాఫీ విషయంలో కేసీఆర్ సర్కారు విఫలమైందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. మొన్న జీఎస్టీ సమావేశాల కోసం కేవలం ఒకరోజే అసెంబ్లీ సమావేశమైంది. ఈ సమయంలో ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. మరిన్ని రోజులు జరపాలని డిమాండ్ చేశాయి. ఉద్యోగాల ప్రకటన, నిరుద్యోగ సమస్య, తాగునీటి పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, వాటి రీడిజైనింగ్ ఇలా.. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నందున సభ నిర్వహించే సమయాన్ని పొడగించాలని కోరాయి.
ఇక్కడే కేసీఆర్ తన మార్కు రాజకీయం ప్రదర్శించారు. వర్షాకాల సమావేశాలను సెప్టెంబరు 17నుంచి నిర్వహించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే గనక నిజమైతే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. తీరా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా చేయాలన్నది కేసీఆర్ ప్లాన్. ఇందులో భాగంగానే నిరుద్యోగుల కోసం గ్రూప్-2 నోటిఫికేషన్, కల్వకుర్తి నీటి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, సిరిసిల్ల- హన్మకొండలను జిల్లాల జాబితాల నుంచి తప్పించడం చేస్తూ వచ్చారు.
కానీ, కాంగ్రెస్ ఇక్కడ రైతురుణమాఫీ అంశాన్ని ఎంచుకుంది. ఇప్పటికిప్పుడు మూడోదశ రుణమాఫీ చేయాలని డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చింది. రైతుల కోసం కేవలం రూ.4వేల కోట్లు ఇవ్వడానికి కేసీఆర్ కు చేతులురావడం లేదా? అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు మళ్లిస్తోన్న ప్రభుత్వం.. రైతుల విషయంలో చిన్నచూపు చూడటం తగదని హితవు పలికారు. రైతుల మూడోదశ రుణమాఫీ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నినాదాన్ని ప్రజల్లోకి ముఖ్యంగా రైతుల వద్దకు చేరేలా వారి వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాల్లోపు ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసినా తమ ఒత్తిడి వల్లే సాధ్యమైందని చెప్పుకోవచ్చన్నది కాంగ్రెస్ ప్లాన్లా కనిపిస్తోంది. మొత్తానికి రుణమాఫీ అంశం భుజానికెత్తుకోవడం రైతుల్లో కాంగ్రెస్కు కాస్త మైలేజీ పెంచేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story