Telugu Global
NEWS

ఆప‌రేష‌న్ న‌ల్ల‌గొండ‌!

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల ఉనికిని దెబ్బ‌తీసేలా అధికార పార్టీ చేపట్టిన కార్య‌క్ర‌మం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌. ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటూ రోజురోజుకు అసెంబ్లీలో త‌న బ‌లాన్ని పెంచుకుంటూపోతోంది. తాను చేప‌ట్టే ప‌నులకు మెజారిటీ ఎమ్మెల్యేలు మ‌ద్దతు తెలిపేలా, ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే ప్ర‌తిపక్షాల‌ను దెబ్బ‌కొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ ఈ పంథాను అనుస‌రిస్తున్నారు. మొన్న టీడీపీ.. నిన్న వైసీపీ.. రేపు కాంగ్రెస్ పార్టీల విలీన‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. త‌న పార్టీ […]

ఆప‌రేష‌న్ న‌ల్ల‌గొండ‌!
X
తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల ఉనికిని దెబ్బ‌తీసేలా అధికార పార్టీ చేపట్టిన కార్య‌క్ర‌మం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌. ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటూ రోజురోజుకు అసెంబ్లీలో త‌న బ‌లాన్ని పెంచుకుంటూపోతోంది. తాను చేప‌ట్టే ప‌నులకు మెజారిటీ ఎమ్మెల్యేలు మ‌ద్దతు తెలిపేలా, ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే ప్ర‌తిపక్షాల‌ను దెబ్బ‌కొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ ఈ పంథాను అనుస‌రిస్తున్నారు. మొన్న టీడీపీ.. నిన్న వైసీపీ.. రేపు కాంగ్రెస్ పార్టీల విలీన‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. త‌న పార్టీ ప్రాబ‌ల్యాన్ని పెంచుకోవ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌తిప‌క్షాల‌కు నాయ‌కుల కొర‌త సృష్టించి.. ఆర్థికలోటు త‌లెత్తేలా చేయ‌డం… త‌ద్వారా 2019లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ఈ చేరిక‌ల‌ను ఆయ‌న ప్రోత్స‌హిస్తున్నారు. వాస్త‌వానికి సీఎం కేసీఆర్ చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు కొన్ని సాహ‌సోపేత‌మైన‌వి. అంటే.. రాష్ట్ర ఖ‌జానాపై భారం ప‌డేసేవ‌న్న‌మాట‌. వీటిని ప్ర‌తిప‌క్షాలు ప్రజాక్షేత్రంలో ఎండ‌గడితే.. పార్టీ ప్ర‌తిష్ట కొద్దిగా మ‌స‌క‌బారే ప్ర‌మాద‌ముంది. అందుకే, అలాంటి నిర‌స‌న‌లు, ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు లేకుండా చేయాల‌ని సీఎం వ్యూహాలు ర‌చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆయ‌న పెట్టుకున్న పేరు బంగారు తెలంగాణ‌, రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌.
న‌ల్ల‌గొండ జిల్లానే ఎందుకు?
2014 ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ 120 అసెంబ్లీ స్థానాల‌కు 63 గెలుచుకుంది. ఉత్త‌ర తెలంగాణ‌లో చాలా చోట్ల క్లీన్ స్వీప్ చేసిన గులాబీ దండు. ద‌క్షిణ తెలంగాణ‌లో అనుకున్నంత ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ముఖ్యంగా పాల‌మూరు, న‌ల్ల‌గొండ‌, హైద‌రాబాద్‌, ఖ‌మ్మంలో అనుకున్న‌న్ని స్థానాలు రాలేదు. అందుకే ఆయా జిల్లాల‌పై దృష్టి పెట్టింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వాన్ని కూల‌గొడ‌తామంటూ.. పొన్నాల చేసిన వ్యాఖ్య‌ల‌తో కేసీఆర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లు పెట్టారు. ఓటుకునోటు కేసుతో ఇది రెండింత‌లైంది. ఏకంగా అసెంబ్లీలో అధికార పార్టీలో టీడీపీ, వైసీపీల విలీనానికి దారి తీసింది. ఇందులో భాగంగా ఉద్య‌మాల జిల్లాగా పేరొందిన న‌ల్ల‌గొండ‌లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను గులాబీమ‌యం చేయాల‌నుకుంటున్నారు. ఈ జిల్లాలో ఇప్ప‌టికే ఒక ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన ఆరింటిలో వెంక‌ట‌రెడ్డి, భాస్క‌ర్ రావు కారెక్కేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీంతో ఇక జిల్లాలో మొత్తం 12 స్థానాల్లో కేవ‌లం న‌లుగురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే మిగులుతారు. వారిని కూడా త్వ‌ర‌లోనే.. కారెక్కించ‌డం పెద్ద‌ప‌నికాదంటున్నారు జిల్లా గులాబీనేత‌లు.
First Published:  3 Jun 2016 9:00 PM GMT
Next Story