మరో ఓవర్టేక్ గొడవ...మరో హత్య!
బీహార్లో ఓవర్టేక్ గొడవలో హత్యకు గురయిన ఆదిత్య కుమార్ సచ్దేవ్ ఉదంతం మర్చిపోకముందే ఢిల్లీ శివారు ప్రాంతంలోని నోయిడాలో అలాంటేదే మరొక సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం…బులంద్ షహర్ గ్రామానికి చెందిన గౌరవ్ చౌహాన్ క్యాబ్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అతను ఓ వివాహవేడుకకు ఢిల్లీకి వెళ్లి సోమవారం అర్థరాత్రి తిరిగి నోయిడాకు వెళుతున్నాడు. గౌరవ్ ట్యాక్సీలో మరో ఇద్దరు బంధువులు ఉన్నారు. మయూర్ విహార్ అనే ప్రాంతంలో గౌరవ్ ట్యాక్సీని మరొక ట్యాక్సీ డ్రైవర్ […]
బీహార్లో ఓవర్టేక్ గొడవలో హత్యకు గురయిన ఆదిత్య కుమార్ సచ్దేవ్ ఉదంతం మర్చిపోకముందే ఢిల్లీ శివారు ప్రాంతంలోని నోయిడాలో అలాంటేదే మరొక సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం…బులంద్ షహర్ గ్రామానికి చెందిన గౌరవ్ చౌహాన్ క్యాబ్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అతను ఓ వివాహవేడుకకు ఢిల్లీకి వెళ్లి సోమవారం అర్థరాత్రి తిరిగి నోయిడాకు వెళుతున్నాడు. గౌరవ్ ట్యాక్సీలో మరో ఇద్దరు బంధువులు ఉన్నారు. మయూర్ విహార్ అనే ప్రాంతంలో గౌరవ్ ట్యాక్సీని మరొక ట్యాక్సీ డ్రైవర్ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు ఎంత ప్రయత్నించినా గౌరవ్ అతనికి దారి ఇవ్వకపోవడంతో కోపంతో…ఆ ట్యాక్సీ డ్రైవర్, గౌరవ్ ట్యాక్సీని వెనుక నుండి ఢీకొట్టాడు. వెంటనే గౌరవ్ తన కారునుండి దిగి వెనుక కారు డ్రైవర్తో గొడవకు దిగాడు.
ఇది జరుగుతుండగానే ముగ్గురు వ్యక్తులు బైక్ల మీద అక్కడకు వచ్చారు. వారు వెనుక ట్యాక్సీలో ఉన్నవారికి సంబంధించినవారు కావచ్చు…వారు రాగానే గౌరవ్మీద పదునైన ఆయుధాలతో దాడి చేసి పరారయ్యారు. గౌరవ్కి తీవ్రంగా గాయాలు కాగా, కారులో ఉన్న బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్టుగా డాక్టర్లు చెప్పారు. గౌరవ్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. తరచుగా జరుగుతున్న ఈ తరహా ఘటనలను చూస్తుంటే వాహనదారులు ఓవర్టేక్ విషయంలో మొండిగా వ్యవహరించి ప్రాణాలమీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఏ వాహనంలో ఎలాంటి వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారో అంచనా వేయటం కష్టం కనుక.