సత్యశ్రీని కొడుకు కోడలే చంపేశారు!
వినుకొండలో సంచలనం సృష్టించిన మాకినేని సత్యశ్రీ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఆమె కుమారుడు సందీప్, కోడలు శ్రావణ్యలే హంతకులని తేల్చిన పోలీసులు వారిద్దరినీ గురువారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…మాకినేని శివ సుబ్బారావు, సత్యశ్రీ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు సందీప్, కుమార్తె సందీప్తి. ఇద్దరినీ ఇంజనీరింగ్ చదివించాలని అనుకున్నా కుమార్తె చదువు పూర్తి చేయగా సందీప్ చదువు మధ్యలో ఆపేసి రకరకాల వ్యాపారాలు చేశాడు. పెళ్లయితే అతను స్థిరపడతాడనే ఆశతో శ్రావణ్యని […]
వినుకొండలో సంచలనం సృష్టించిన మాకినేని సత్యశ్రీ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఆమె కుమారుడు సందీప్, కోడలు శ్రావణ్యలే హంతకులని తేల్చిన పోలీసులు వారిద్దరినీ గురువారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…మాకినేని శివ సుబ్బారావు, సత్యశ్రీ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు సందీప్, కుమార్తె సందీప్తి. ఇద్దరినీ ఇంజనీరింగ్ చదివించాలని అనుకున్నా కుమార్తె చదువు పూర్తి చేయగా సందీప్ చదువు మధ్యలో ఆపేసి రకరకాల వ్యాపారాలు చేశాడు. పెళ్లయితే అతను స్థిరపడతాడనే ఆశతో శ్రావణ్యని ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు. శ్రావణ్యని అత్తమామలే బిఇడి చదివించారు. అయితే సందీప్ చేసిన వ్యాపారాల్లో నష్టాలు రావడంతో శివసుబ్బారావు ట్రావెల్స్ వ్యాపారంలో సంపాదించుకున్నదంతా అప్పులు తీర్చడానికి ఖర్చుచేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు రెండు ఇళ్లను అమ్మేసి అద్దెఇంటికి మారారు. మరోవైపు అప్పులకు వడ్డీలు కట్టాల్సి రావటంతో సత్యశ్రీ కొడుకు కోడలు ఇద్దరినీ ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని పోరుతుండేది. ఆ మాటే ఆమె ప్రాణాలు తీసింది.
సత్యశ్రీ మాటలు నచ్చని సందీప్ శ్రావణ్యలు ఆమెని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 23న శివసుబ్బారావు మార్నింగ్ వాకింగ్కి వెళ్లగా, సందీప్, శ్రావణ్య ఇద్దరు కలిసి సత్యశ్రీ మీద దాడి చేశారు. సత్యశ్రీ తలమీద నీళ్లక్యానుతో గట్టిగా కొట్టారు, శ్రావణ్య షులేస్ను ఆమె మెడకు చుట్టి బిగించటంతో కంఠం తెగి తీవ్రగాయమైంది. పెనుగులాడుతున్న సత్యశ్రీని కోడలు ఇష్టం వచ్చినట్టు కొరకగా శరీరమంతా పంటిగాట్లు పడ్డాయి. సత్యశ్రీ చనిపోయిందని నిర్దారించుకున్నాక సందీప్ తన గదిలోకి వెళ్లిపోగా శ్రావణ్య హాల్లో పడిపోయినట్టు నటించింది. మార్నింగ్ వాకింగ్ నుండి తిరిగి వచ్చిన శివసుబ్బరావుకి కొడుకు కోడలు చెబుతున్న మాటలపై అనుమానం రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి.