ఒక పక్క మలమూత్రాలను మోస్తున్న మనుషులు... మరో పక్క జాతీయతపై చర్చలా?
సాటి మనుషుల మలమూత్రాలను చేతులతో ఎత్తివేస్తూ, ఆ బకెట్ని తలమీద మోస్తూ, చేతుల్లో చీపుర్లతో ఉన్న సఫాయీ కార్మికులు మువ్వన్నెల జెండాని ఎలా పట్టుకోగలరని అంబేద్కర్ ఆశయ సాధకులు మరోసారి ప్రశ్నించారు. దేశమంతా అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్న వేళ సఫాయి కర్మచారీ ఆందోళన్ సభ్యులు, వందల మంది సపాయీ కార్మికులు, అంబేద్కర్ ఆశయ సాధకులు భీమ్ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిర్వహించారు. పారిశుధ్య కార్మికుల చేతులు త్రివర్ణపతాకాన్ని ఎత్తిపట్టుకునే స్థితిలో […]
సాటి మనుషుల మలమూత్రాలను చేతులతో ఎత్తివేస్తూ, ఆ బకెట్ని తలమీద మోస్తూ, చేతుల్లో చీపుర్లతో ఉన్న సఫాయీ కార్మికులు మువ్వన్నెల జెండాని ఎలా పట్టుకోగలరని అంబేద్కర్ ఆశయ సాధకులు మరోసారి ప్రశ్నించారు. దేశమంతా అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్న వేళ సఫాయి కర్మచారీ ఆందోళన్ సభ్యులు, వందల మంది సపాయీ కార్మికులు, అంబేద్కర్ ఆశయ సాధకులు భీమ్ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిర్వహించారు. పారిశుధ్య కార్మికుల చేతులు త్రివర్ణపతాకాన్ని ఎత్తిపట్టుకునే స్థితిలో లేవని, నెత్తిమీద బకెట్లు, చేతుల్లో చీపుర్లు ఉంటే అదెలా సాధ్యమవుతుందని సఫాయి కర్మచారి, కవి దేవ్ కుమార్ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో జాతీయత గురించి చర్చించుకోవడంపై ఆయన తీవ్రనిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎలాంటి రక్షణ సాధనాలు లేకుండా సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్మికుల మరణాలు ప్రమాదవశాత్తూ జరిగినవి కావని, అవి రాజకీయ హత్యలని సఫాయీ కర్మచారి ఆందోళన్ జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్ అన్నారు. మార్చి 2014 నుండి మార్చి 2016 మధ్యకాలంలో 1,268మంది కార్మికులు పారిశుధ్య విధుల్లో మృత్యువాత పడ్డారని, ఇవన్నీ నమో దు అయినవి మాత్రమేనని విల్సన్ అన్నారు. గతనెలలో ఒక్క రోజులోనే నలుగురు సఫాయీ కార్మికులు మృత్యువాత పడ్డారని మరొకరు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని విల్సన్ తెలిపారు. పోలీసుల రికార్డుల్లో ఇవన్నీ ప్రమాదవశాత్తూ సంభవించిన మరణాలుగా ఉన్నాయని ఆయన అన్నారు.
చేతులతో మలమూత్రాలను ఎత్తే విధానాన్ని వెంటనే నిషేధించాలని, సుప్రీం కోర్టు తీర్పుని అమలు చేస్తూ విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుని కుటుంబానికి పదిలక్షలు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ ప్రధానికి, ఢిల్లీ ప్రభుత్వానికి వారు మెమొరాండం సమర్పించారు. ఒక పక్క డిజిటల్ ఇండియాకి పరుగులు తీస్తూ మరోపక్క దళితులను ఇలాంటి పనుల్లో మగ్గిపోయేలా చేయడంలో ఉన్న ఔచిత్యం గురించి వారు ప్రశ్నించారు. పారిశుధ్య పనుల్లో టెక్నాలజీని ఎందుకు వినియోగించలేకపోతున్నారని సఫాయీ కర్మచారి ఆందోళన్ ప్రశ్నించింది. స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏళ్లు దాటిపోయినా ఇంకా ఇలాంటి వ్యవస్థని మార్చకపోవడం అంబేద్కర్కి, రాజ్యాంగానికి అవమానమేనంటూ వారు తమ నిరసనని వ్యక్తం చేశారు.