Telugu Global
National

పెద్ద కూర నిషేధానికి ఐదో వ్యక్తి బలి

హిందుత్వ వాదులు బలవంతంగా అమలు చేస్తున్న పెద్ద కూర నిషేధం కారణంగా మూడు నెలల కాలంలో అయిదో వ్యక్తి బలయ్యారు. గో రక్షా సంఘం సభ్యులు కర్నాల్ లోని భానూఖేరి గ్రామంలో ఒక వలస కార్మికుడిని అంతమొందించారు. మృతుడు ఖుష్ నూర్ షహరాన్ పూర్ లోని బల్లమరాజా గ్రామానికి చెందిన వాడు. గో రక్షా సంఘం దాడిలో ఎహసాన్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. గోవులను లారీల్లో తరలిస్తున్న దాఖలాలు ఏవీ లేవని పోలీసు సూపరింటెండెంట్ […]

పెద్ద కూర నిషేధానికి ఐదో వ్యక్తి బలి
X

హిందుత్వ వాదులు బలవంతంగా అమలు చేస్తున్న పెద్ద కూర నిషేధం కారణంగా మూడు నెలల కాలంలో అయిదో వ్యక్తి బలయ్యారు. గో రక్షా సంఘం సభ్యులు కర్నాల్ లోని భానూఖేరి గ్రామంలో ఒక వలస కార్మికుడిని అంతమొందించారు. మృతుడు ఖుష్ నూర్ షహరాన్ పూర్ లోని బల్లమరాజా గ్రామానికి చెందిన వాడు. గో రక్షా సంఘం దాడిలో ఎహసాన్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు.

గోవులను లారీల్లో తరలిస్తున్న దాఖలాలు ఏవీ లేవని పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ నైన్ తెలియజేశారు. పంజాబ్ లోని నవాన్ షహర్ నుంచి ఉత్తర ప్రదేశ్ లోని తమ స్వస్థలాలకు వెళ్తున్న 40 మంది వలస కార్మికులపై గుర్తు తెలియని వ్యక్తుల బృందం కాల్పులు జరిపిందని ఆయన చేప్పారు. గో రక్షా సంఘం కార్యకర్తలను గుర్తించడానికి ఏడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని కూడా పంకజ్ నైన్ తెలియజేశారు.

తాము లారీలోంచి దిగగానే అందులో గోవులను తరలిస్తున్నారా అని సాయుధులైన వారు ప్రశ్నించారని, ఇంతలోనే సాయుధుల్లోని ఒకరు కాల్పులు జరిపితే ఖుష్ నూర్ మరణించాడని వలస కార్మిలు చెప్పారు.

మంగళ వారం అర్థ రాత్రి గోవులను తరలించే అవకాశం ఉందని గో రక్షా సంఘం వారు తమకు సమాచారం అందించారని అందుకే భానూ ఖేరీ గ్రామానికి పోలీసులను పంపించామని, లారీలో వెళ్తున్నది ఎవరో తెలుసుకోకుండా పోలీసుల్లో ఎవరో కాల్పులు జరిపి ఉండొచ్చని కర్నాల్ పొలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ హనీఫ్ ఖురేషీ అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

నవంబర్ 29న ఇలాంటి సంఘటనలోనే థానేసర్ వద్ద హర్యానా పోలీసులతో జరిగిన ఎదురుకాల్పులలో గోవులను రవాణా చేస్తున్నాడన్న ఆరోపణ ఉన్న 27 ఏళ్ల ఆబిద్ అనే వ్యక్తి మరణించాడు.

హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవలే హర్యానా గో వంశ్ సంరక్షణ్, గో సంవర్ధన్ చట్టాలను తీసుకొచ్చి గో హత్యను నిషేధించడంతో పాటు ఆవులను రవాణా చేయడాన్ని కూడా నిషేధించింది.

“ముస్లింలు ఈ దేశంలో ఉండొచ్చు కాని వారు పెద్ద కూర తినడం మానేయాలి” అని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇటీవల అన్నారు.

పెద్ద కూర తిన్నాడని, ఆ మాంసాన్ని నిలవ చేశాడన్న ఆరోపణతో సెప్టెంబర్ 28న మహమ్మద్ అఖ్లాక్ ను కొట్టి చంపిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16న హిమాచల్ ప్రదేశ్ లో నోమాన్ అనే వ్యక్తిని ఒక మూక అంతమొందించింది. ఆయన ఆవులను దొంగ రవాణా చేస్తున్నాడన్న ఆరోపణతో ఈ దాడి జరిగింది. కశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలో అక్టోబర్ 9న లారీ నడిపే 18 ఏళ్ల జహీద్ రసూల్ భట్ మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఆ తర్వాత రసూల్ మరణించాడు.

జమ్మూ-కశ్మీర్ లో పెద్దకూరను నిషేధించినందుకు నిరసనగా పెద్ద కూర పండగ నిర్వహించిన ఇండిపెండెంటు సభ్యుడు అబ్దుర్ రషీద్ ను బీజేపీ శాసన సభ్యులు అసెంబ్లీలోనే చితక బాదారు. గోమాంసం తినడానికి సాహసిస్తే కర్నాటక ముఖ్య మంత్రి సిద్ధ రామయ్య తల నరికేస్తామని నవంబర్ రెండో తేదీన శివమొగ్గ జిల్లా స్థాయి బీజేపీ నాయకుడు ఎస్.ఎన్. చెన్నబస్సప్ప హెచ్చరించారు.

First Published:  11 Dec 2015 9:00 PM GMT
Next Story