Telugu Global
Others

రెండు వర్గాలుగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ!

పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు… అనే సామెతకు సరిపొయేటట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ పరిస్థితి. 2014కు ముందు ఆంధ్రా ప్రాంతంలో తాము బీజేపీకి చెందిన నాయకులమని చెప్పుకొవడానికే అలోచించే కమలనాధులు ఇప్పుడు కాలరెగరేసి మరీ చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో వర్గాలుగా విడిపోయి పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. మొదట్నుంచీ ఆంధ్రాలో బిజెపి నాయకులంటే గుర్తొచ్చేది వెంకయ్యనాయుడు, హరిబాబు, కృష్ణంరాజు మొదలైనవారు.. వీరంతా టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ఉండేవారు. ఫలితంగానే 1999 నుంచి 2004 మధ్య […]

రెండు వర్గాలుగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ!
X
naniపళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు… అనే సామెతకు సరిపొయేటట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ పరిస్థితి. 2014కు ముందు ఆంధ్రా ప్రాంతంలో తాము బీజేపీకి చెందిన నాయకులమని చెప్పుకొవడానికే అలోచించే కమలనాధులు ఇప్పుడు కాలరెగరేసి మరీ చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో వర్గాలుగా విడిపోయి పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. మొదట్నుంచీ ఆంధ్రాలో బిజెపి నాయకులంటే గుర్తొచ్చేది వెంకయ్యనాయుడు, హరిబాబు, కృష్ణంరాజు మొదలైనవారు.. వీరంతా టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ఉండేవారు. ఫలితంగానే 1999 నుంచి 2004 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి-బిజెపిలు కలసి పని చేసినా ఎప్పుడూ విభేదాలు బయట పడలేదు. కాని ఇపుడు పరిస్థితి మారిపోయింది. 2014లో తెలుగుదేశంతో జట్టుకట్టి పోటీ చేసినా ఆ తర్వాత జరిగిన పరిణామాలు బీజేపీలో వర్గపోరుకు దారి తీశాయి. మొత్తం మీద బీజేపీ రాష్ట్రంలో రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో జాడ లేకుండా పోవడంతో కొంతమంది నాయకులు ఉనికి చాటుకోవడానికి బీజేపీలో ప్రవేశించారు. కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించిన ఈ నాయకులు అప్పటి నుంచే చంద్రబాబుకు బద్ధ విరోధులుగా ఉన్నారు. వీరు బీజేపీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీతోను, ఆ పార్టీ అధినేత చంద్రబాబుతోను అంతే దూరం పాటిస్తున్నారు. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది.
అనూహ్యమైన పరిణామాల మధ్య రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏపీలో నూకలు చెల్లిపోయాయి. ఒకేఒక్క చోట డిపాజిటు వచ్చింది. మిగిలిన 174 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ పరిస్థితిలో ఓ మంచి రాజకీయపార్టీ ఆశ్రయం కోసం చూసిన ఆ పార్టీలోని సీనియర్‌ నాయకులు దగ్గుపాటి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్షీనారాయణ తదితరులు బిజెపి తీర్దం పుచ్చుకున్నారు. వీరందరూ చంద్రబాబుకు బద్ధశత్రువులు. ఈ ప్రభావం మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం-బీజేపీల పైన కూడా పడుతోంది. ప్రభుత్వంలో మిత్రత్వం ఉన్నా పార్టీలోను, వ్యక్తుల్లోను ఇది లోపించింది. తాము తక్కువ కాదన్నట్టు ఇరుపార్టీల నాయకులు వ్యవహరిస్తూ ఎవరికివారు ఆధిపత్య పోరు నెరపుతున్నారు. ఈ దూరం పార్టీలో పాత-కొత్త నాయకుల మధ్య సుస్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ జనతాపార్టీలో కొత్తగా చేరినవారు పాత నాయకులను లెక్క చేయకపోవడంతో పాత నాయకులకు-కొత్త నాయకులకు మధ్య అధిపత్య పోరు నడుస్తోంది. ఉదాహరణకు భారతీయ జనతాపార్టీలో మొదటి నుంచి ఉన్న వెంకయ్యనాయుడు, హరిబాబు మొదలైన వారు చంద్రబాబు ఏ తప్పు చేసినా ఆయన్ని వెనకేసుకొస్తున్నారు. ఈ విధానం నచ్చని పురందేశ్వరి, కావూరి, కన్నా వంటి నాయకులు అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని ఎడాపెడా ఏకిపారేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ ముఖ్య నాయకులు పార్టీ అజెండాను ప్రక్కకు పెట్టి… వ్యక్తిగత ప్రతిష్టకు పోతూ ఎవరి అజెండాతో వారు పని చేస్తున్నారు. దీంతో బిజెపి కింద స్థాయి శ్రేణులు, కార్యకర్తలు గందరగోళనికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పురుడు పొసుకుంటున్న భారతీయ జనతాపార్టీలో ఈ వర్గ విభేదాలు ఇలాగే కొనసాగితే బిజెపి బతికి బట్టకట్టడం కష్టమని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
– సవరం నాని
First Published:  26 Sep 2015 7:02 PM GMT
Next Story