Telugu Global
Arts & Literature

తెలుగు గడ్డపై లేచిన యువ కళాతరంగం... ఏలే లక్ష్మణ్‌

ఏలే లక్ష్మణ్‌ చిత్రాలు చూస్తున్నపుడు క్రింద ఏలే సంతకం కోసం వెదకనవసరం లేదు. చిత్రంలోని ప్రతి బిందువులోనూ అతనొక అంతః శక్తిగా రూపాంతరం చెందుతాడు. ఆ చిత్రాలలో మనకు కొట్టొచ్చినట్లు కనపడేది అందంగా, అమాయకంగా పరచ బడ్డ పల్లెటూరి అమ్మతనం. నీరెండలో స్నానం చేసిన పల్లెను సుతారంగా తన కుంచెతో స్పృశిస్తూ వారి దైనందిన జీవనాన్ని ఆహ్లాదంగా మన ముందుంచే కళాత్మకత. తన చుట్టూ వున్న చెట్లూ, చేమలు, రాళ్ళు రప్పలలోని, రాళ్ళను, కొమ్మలను, రెమ్మలను లెక్క […]

తెలుగు గడ్డపై లేచిన యువ కళాతరంగం... ఏలే లక్ష్మణ్‌
X
ele laxmna
ఏలే లక్ష్మణ్‌

ఏలే లక్ష్మణ్‌ చిత్రాలు చూస్తున్నపుడు క్రింద ఏలే సంతకం కోసం వెదకనవసరం లేదు. చిత్రంలోని ప్రతి బిందువులోనూ అతనొక అంతః శక్తిగా రూపాంతరం చెందుతాడు. ఆ చిత్రాలలో మనకు కొట్టొచ్చినట్లు కనపడేది అందంగా, అమాయకంగా పరచ బడ్డ పల్లెటూరి అమ్మతనం. నీరెండలో స్నానం చేసిన పల్లెను సుతారంగా తన కుంచెతో స్పృశిస్తూ వారి దైనందిన జీవనాన్ని ఆహ్లాదంగా మన ముందుంచే కళాత్మకత. తన చుట్టూ వున్న చెట్లూ, చేమలు, రాళ్ళు రప్పలలోని, రాళ్ళను, కొమ్మలను, రెమ్మలను లెక్క కట్టి మరీ వాటి సౌందర్యాన్ని తన చిత్రాలలో సజీవంగా నిలుపుతాడు. ఆ చిత్రాల ముందు మనం నిలబడినపుడు అవి ఒక సుతి మెత్తని పలకరింపుతో మనల్ని పరవశింపజేస్తాయి. మచ్చుకైనా భేషజం లేని పల్లెటూరి జీవన స్రవంతిని మనముందుంచటం కోసం అనాగరికంగా మనం భావించే పల్లె రంగులైన జాజు, ఎఱ్ఱమట్టి రంగు, గోడలకు అలకే సున్నం, వాటికి పెట్టే ఎఱ్ఱబొట్లను విరివిగా ఉపయోగిస్తాడు. మట్టిరంగుల అందాల సోయగాన్ని చూడమంటాడు. ఆ రంగులంటే అతని కిష్టం.

లక్ష్మణ్‌ తండ్రి చంద్రయ్య మగ్గాన్ని నమ్ముకొని జీవించే జీతగాడు. తల్లి వీరమ్మ కూలి. కలల్నీ, కన్నీళ్ళనీ కలనేత నేయగల ఒక తెలంగాణా పల్లె కదిరినేని గూడెం అతని స్వస్థలం ఇది భువనగిరికి 25 కి|| దూరంలో ఉంది. ”మన్నులో కూర్చుని చదివాను, నా కెప్పుడూ అత్తెసరు మార్కులే. నూనె రాసిన కాగితంపై ట్రేస్‌ వేసిన నాయనమ్మ చిత్రం నా మొదటి బొమ్మల్లో ఒకటి” అని తన బాల్యపు ముచ్చటను చెబుతాడు. భువనగిరిలో సైన్‌ బోర్డులు వ్రాసే గోపీని చూసి తన గీతలను మెరుగు పెట్టుకున్నాడు. భువనగిరిలో వున్న సినీనటుల అభిమాన సంఘాల వారికి బేనర్లు వ్రాసి పెట్టేవాడు. రామన్నపేటలో జూనియర్‌ కాలేజీలో చదువుతున్నపుడు ఉపాధ్యాయులు కార్టూన్లు గీయటం నేర్చుకోమని ప్రోత్సహించారు.

3చిత్రకళా ప్రపంచంలోని వాదాలు, ధోరణులు అన్నీ లలితకళాశాల విద్యార్థిత్వం నుంచే పరిచయమైనాయి. సికింద్రాబాద్‌, రాణీగంజ్‌లో సైన్‌ బోర్డు ఆర్టిస్టుగా జీవితం ప్రారంభించి అక్కడ నుండి ఈనాడు పత్రికలో చిత్రకారునిగా చేరిన తరవాత పరిధి విస్తృతం కావటం ప్రారంభమైంది. లక్ష్మాగౌడ్‌, వైకుంఠం చిత్రాలు చూశాక, వారిని కలిసాక వెదకబోయిన తీగ దొరికి నట్లయింది. ”దారం పోగు అతకడానికి రాదు, నువ్వేం సాలోనివిరా” అనే తండ్రి మొదటిసారి జరిగిన ఏలే చిత్ర ప్రదర్శనలో తన బొమ్మను చూసుకొని మురిసిపోయాడు. దానితో రెచ్చిపోయిన లక్ష్మణ్‌ తన చిత్రకళా పరిధిని రాష్ట్రస్థాయిని దాటించి, దేశమంతా విస్తరింప జేసాడు. ఈరోజు మన దేశంలో ప్రముఖమైన చిత్రకారులలో అతనొకడు.

4లక్ష్మణ్‌లో చిత్రకళతోపాటు మంచి సాహిత్యాభిరుచి కూడా వుంది. గోసంగి కవుల కవిత్వం అన్నా, ఒక అనుభవాన్ని సృశించే ఇస్మాయిల్‌ హైకూలన్నా అతనికిష్టం. అసలు కవిత్వ మంటేనే ఇష్టం. అందుకే సమాంతర ఆధునిక సాహిత్యాన్ని చదివాడు. అసంఖ్యాకమైన కవితా సంకలనాలకూ, కథలకు ముఖచిత్రాలు వేశాడు. అయితే ఎప్పుడూ ఎవరి రచనలకూ ప్రతిబింబ చిత్రాలు గీయలేదు. కవితో సమాంతరంగా, ఏఏ అంశంపై కవిత్వ రూపం వ్యక్తమవుతుందో, అదే అంశం మీద తనదైన శైలిలో అట్టమీద బొమ్మ గీసి దానికి సొంత వాఖ్యానం చేస్తాడు. చిత్రకారులు సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకున్నంత లోతుగా సాహిత్యకారులు చిత్రకళను ఆకళింపు చేసుకోకపోవటంతో, పుస్తక సమీక్షకులు తమ సమీక్షలో ముఖచిత్రంపై ఒక్క మాటైనా వ్రాయలేక పోవటం బాధ కలిగిస్తుందంటాడు. ముఖచిత్రాలపై అతను చూపిన సాధికారతకు ఒక ఉదాహరణగా జింబో వ్రాసిన పద్య సంపుటిని చేతుల్లోకి తీసుకున్నపుడు చాలా సేపటివరకు పేజీలు తిప్పకుండా అట్టమీద బొమ్మనే చూస్తూ కూర్చున్నాను. అలాంటిదే లోకేశ్వర్‌ – సలాం హైద్రాబాద్‌కి కి వేసిన చిత్రం. సమీక్షకులు రివ్యూలో ముఖచిత్రాన్ని Out of Coverage గా భావించటం భాదాకరం అంటాడు లక్ష్మణ్‌.

5ప్రతి చిత్రకారునికి ఒక ప్రత్యేకమైన అభిరుచి, వ్యక్తీకరణలు వుంటాయి. లక్ష్మణ్‌, విప్లవానికిచ్చే రంగు ఎరుపు కాదు నలుపు. అలానే బిగించిన పిడికిలి, జెండాలను విప్లవ సంకేతంగా అతను భావించడు. ఒక పక్క నిరంతర సాధన గావిస్తూ, మరొక ప్రక్క అంతర్ముఖుడై తన తెలంగాణా పల్లెలోపల నల్లటి విప్లవాన్ని కోరుకునే దళిత, బహుజన ప్రపంచంలోకి తొంగిచూస్తూ, రంగుల భాషలో, నల్లటి గీతల్లో అస్తిత్వాన్ని దర్శించుకొనే ప్రయత్నం చేస్తూ వుంటాడు. అతని కుంచెలో నుంచి జాలువారుతున్న ఆ వర్ణక్రమమేమిటో మనం లక్ష్మణ్‌ మాటల్లో అతన్నే అడిగి తెలుసుకుందాం.

” నేను వేసే చిత్రాలన్నీ ఫిగరేటివ్‌, నేను డిస్టార్షన్‌ అనే దాన్ని నమ్ముతాను. అది అవసరం కూడా. అందులోనే ఎక్కువ రియాలిటీకి అవకాశం వుంటుంది. డిస్టార్షన్‌లో చలనమూ, లోతూ వుంటాయి.

1నా చిత్రాలకి డార్క్‌ ఇమేజస్‌నే ఎంపిక చేసుకుంటాను. భావవ్యక్తీకరణని అందులోనే బాగా చూడగలుగుతాం. నేను ఇతివృత్తంగా ఎంచుకున్న ప్రపంచమూ, మనుషులూ చీకట్లోనే వున్నాయి. అవన్నీ సహజమైన మట్టి రంగులే. ముదురు రంగుల్లో, నలుపులో విషాదం తీవ్రంగా వ్యక్తపరచబడుతుంది.

రాళ్ళు నాకు ఇష్టమైన సబ్జెక్టు. బోన్‌గిరి ప్రాంతంలోని చిన్నచిన్న గుట్టలూ, కొండలూ నాకిష్టం. ఉదయాస్తమయాల్లో ఆ రాళ్ళు గోధుమ, పసుపు, నలుపురంగుల్లో నిశ్శబ్దంగా మెరిసేవి. నేనెరిగిన మనుషులూ, ప్రపంచమూ ఆ రాళ్ళలోకి ఒదిగిపోయి తమ బాధలూ, గాథలూ చెప్పుకున్నట్టుండేవి. ఆ భావననే నా చిత్రాలలో ప్రవేశ పెట్టాను. మాకు బర్రెలుండేవి. ఎండాకాలం సెలవుల్లో నేనే బర్రెలు మేపేవాణ్ణి. మా పొలంలోని రాళ్ళ గుట్టల దగ్గరికి బర్రెల్ని తోలుకు పోయేవాణ్ణి. రాళ్ళు రకరకాల ఆకారాల్లో పలకరించేవి నన్ను. మా అమ్మ, నేనూ పొలంలోని రాళ్ళన్నీ ఓ మూలకి జరపి చెల్కనంతా చదును చేసేవాళ్ళం. నా చిన్న తనమంతా కదిరేని గూడెం దాటిపోలేదు. బాగా ఊహ తెలిసేంత వరకూ నేను ఆ గ్రామంలోనే పెరిగాను. ఎప్పుడో ఒకసారి ‘బోన్‌గిరి’ వెళ్ళేవాళ్ళం. ఒకసారి ఓ సంఘటన జరిగింది. మేం సర్కస్‌ చూడ్డానికి వెళ్ళాం. ఒక పల్లెటూరి స్త్రీ కొప్పులో పూలు పెట్టుకొని బస్టాండ్‌లో కింద కూర్చునివుంది. హఠాత్తుగా ఒక మేక పిల్ల వెనుక నుంచి వచ్చి ఆమె కొప్పులోని పూలను మేసేసింది. ఆ దృశ్యం నా మనసులో ముద్రించుకు పోయింది.

నా చిన్నప్పటి ఆ సన్నివేశం ఇటీవల నేను వేస్తున్న ఓ చిత్రంలోకి అలవోకగా ఒదిగిపోయింది. నా చిత్రాలన్నీ అంతే! సహజాతి సహజంగానే వొస్తాయి.

బొమ్మలు మితభాషులుగా వుండాలి:

ఒక చిన్న కాన్వాస్‌ మీద స్పేస్‌ని, దూరాన్ని నియంత్రించుకోవాలి, అంతే! పెయింటింగ్‌లో ఖాళీలు వుంటాయి, ఉండాలి. ఆ ఖాళీలకూ ఒక సందేశం వుంటుంది.
కవిత్వం రాసేటప్పుడు హృదయంలో ఏ బిందువుపై నిలబడి రాస్తారో, అదే స్థితిని అనుభవిస్తూ నేను చిత్రాన్ని వేస్తాను.

2కేన్వాసు, పెయింట్స్‌ – ఈ మెటీరియల్‌ అంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. బొమ్మ వేయబోయే ముందు ఈ పైసల భయం చిత్రకారుణ్ణి హద్దు పరుస్తుంటుంది. అంతశ్చేతనను ఫిల్టర్‌ చేస్తుంటుంది. దీని నుంచి బయటపడి నేచురల్‌ ఫామ్‌ అందుకోవడం కోసం నేను వేస్టు మెటీరియల్‌పై బొమ్మలు వేస్తుంటాను. అందుకోసం ఓల్డ్‌ సిటీకి పోయి అక్కడ పనికిరాని అట్ట ముక్కల్ని, చిన్న చిన్న హాండ్‌ మేడ్‌ కాగితాల్ని కొనుక్కొస్తాను. వాటి మీద కంజ్యూమరిజం భయాలు లేకుండా సహజంగా బొమ్మలు వేసుకుంటాను.

నేను మా వూరిలో చూసిన మనుషులందరి నుంచి స్ట్రాంగ్‌ ఫీచర్స్‌ని గ్రహించాను. వాటిని నా చిత్రాల్లో వుండే మనుషుల్లోకి ప్రవేశపెట్టాను. నేనొక మహిళ బొమ్మనో, మగాడి బొమ్మనో వేస్తే అందులో చాలమంది మహిళల, మగాళ్ల ఎనాటమీ ఇమిడి వుంటుంది. ఒకరిలోనే అనేక రూపాలూ, భావాలూ కనిపిస్తాయి. నా ఈస్తటిక్స్‌ నాకున్నాయి. నా చిత్రాల్లోని మహిళలకు ఏ అలంకారాలూ కనిపించవు. వారి బాధ మాత్రమే వుంటుంది.

పెయింటింగ్‌లోని సాంకేతిక అంశాల్ని నేను అసహ్యించుకుంటాను. ఈ కంజ్యూమర్‌ సొసైటిలో కొనుగోలు దారుణ్ణి భ్రమింపచేయడానికి మాత్రమే ఈ టెక్నిక్‌ అనేది పనికొస్తుంది. చిత్రకారుడు తాను గ్రహించే వస్తువులోని వైవిధ్యంవల్లే ‘శైలి’ అనేది ఏర్పడుతుందని భావిస్తాను.

7పెయింటింగ్‌ అంటే కాలాన్ని గణించేదే. ఆర్టిస్టు చాలావరకూ తను బతికిన కాలాన్ని, అర్థం చేసుకున్న కాలాన్ని తన ఫామ్‌తో గణించే ప్రయత్నం చేస్తాడు.

నా పెయింటింగ్స్‌పై డేట్స్‌ వేయకపోవడానికి ఇదే కారణం. రానున్న కాలంలో నిజమైన ఆర్ట్‌ ఫామ్‌ మాత్రమే మిగుల్తుందని నాకనిపిస్తుంది.

ఏదైనా బొమ్మవేసే ముందు నేను ఏదీ అనుకోను. నాకు తెలిసిన జీవితమే నన్ను కేన్వాస్‌ పైకి తీసుకుపోతుంది. నేను జీవించిన అనుభవమే నా చిత్రాల్లోని ఫామ్‌ని నిర్ధారిస్తుంది. నాకు తెలియంది నేను చిత్రించలేను. గ్రామీణ జీవితమే నా ఇతివృత్తం. ఈ జీవితం తప్ప మిగతా ప్రపంచం నాకంత దగ్గరగా తెలీదు.

6మన ఈ నగర జీవితంలో సహజ వ్యక్తీకరణలుండవు. ఇక్కడి జీవితంలోని నవ్వులూ, కోపాలూ, తాపాలూ కలుషితమయ్యాయి. గ్రామీణ జీవితంలో ఈ అసహజత్వం వుండదు. అక్కడి వాళ్ళు ఉద్రేకాల్ని దాచుకునే ప్రయత్నం చేయరు. వాళ్ళకి ఎలా కూర్చోవాలనిపిస్తే అలా కూర్చుంటారు, ఎలా ప్రవర్తించాలనిపిస్తే అలా నడుచుకుంటారు. అందుకే నేను రూరల్‌ ఫామ్‌ని ప్రేమిస్తాను. ఛానల్‌ కల్చర్‌లో ఏదీ సహజమైన ఫామ్‌ కాదు. అక్కడ జీవితం ఒక అసహజమైన విన్యాసంగా మారుతోంది.

దళిత జీవితాన్నే మీ చిత్రాల ఇతివృత్తంగా ఎందుకు ఎంపిక చేసుకుంటారని కొందరు అడుగుతుంటారు. నాకు వేరే జీవితం తెలీనే తెలీదు. నా బతుకే అది”.

రెండు దశాబ్దాలుగా నగరంలోనే జీవిస్తున్నా పల్లె అందాలు ఇంకా అతన్ని వెంటాడుతూనే వున్నాయి. పసితనం నాటి ఆ జ్ఞాపకాల ఊటలోనే అతనింకా ఈదులాడుతున్నాడు. అందుకే ఆ చిత్రాల్లో వసివాడని పసిడి కనిపిస్తుంది. ”నా పాలెట్‌ (రంగులు కలుపుకునే బోర్డు) ఇంకా కదిరినేనిగూడెం లోనే వుందని” గర్వంగా చెప్పుకునే లక్ష్మణ్‌ అద్భుతమైన తెలంగాణా సోయిని అంతర్జాతీయం చేశాడు.

(సప్తపర్ణి నుంచి)

– కాండ్రేగుల నాగేశ్వరరావు

First Published:  12 Sep 2015 9:00 PM GMT
Next Story