Telugu Global
Others

సీమ ద్రోహి చంద్రబాబు: సీపీఎం ధ్వజం

అభివృద్ధి వికేంద్రీకరణ హామీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని సాధించడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా, పారిశ్రామిక ప్రగతిని హైదరాబాద్‌కే పరిమితం చేసిన ఆయన ఇపుడు అదే తరహాలోనే గుంటూరు, విజయవాడ ప్రాంతాలపై దృష్టి పెట్టారని… […]

సీమ ద్రోహి చంద్రబాబు: సీపీఎం ధ్వజం
X
అభివృద్ధి వికేంద్రీకరణ హామీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని సాధించడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా, పారిశ్రామిక ప్రగతిని హైదరాబాద్‌కే పరిమితం చేసిన ఆయన ఇపుడు అదే తరహాలోనే గుంటూరు, విజయవాడ ప్రాంతాలపై దృష్టి పెట్టారని… పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రత్యేక రాష్ట్రం కోసం రాయలసీమ కూడా పోరాడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధి చేపట్టడం తమకు అభ్యంతరం కాదని, కాని మిగిలిన 11 జిల్లాల్లో ఉండే వారి పరిస్థితి, ఉపాధి అవకాశాల స్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. మొత్తం అభివృద్ధిని రాజధాని చుట్టూ కేంద్రీకరిస్తున్నారన్నారు. కడప జిల్లాలో తలపెట్టిన ఉక్కు కర్మాగార ఏర్పాటుపై ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి కాలువ పనులకు బడ్జెట్‌లో రిక్తహస్తం చూపించారన్నారు. రాయలసీమ జిల్లాల్లో కరువు నివారణకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్నారు. వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోవడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ పరిశ్రమలు, విద్యా సంస్థలు వస్తేనే సీమ అభివృద్ధి చెందుతుందన్నారు. సీమ సమగ్రాభివృద్ధికి ప్రజాందోళనలు ఉధృతం చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో ఎయిర్‌పోర్టులు, కార్పొరేట్‌ పరిశ్రమల పేరుతో నిరుపేదలకు చెందిన వేలాది ఎకరాలను బలవంతంగా సేకరిస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా త్వరలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. ప్రత్యేక హోదాపై టిడిపి, బిజెపి దొంగాట ఆడుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని విభజన సందర్భంగా నాటి యూపీయే ప్రభుత్వం హామీ ఇచ్చిందని, భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని నిలదీసి దాన్ని సాధించడానికి బదులు చంద్రబాబు, బీజేపీతో కలిసి నాటకాలాడుతున్నారని మధు విమర్శించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించుకుంటామని ఆయన హెచ్చరించారు.​
First Published:  3 Aug 2015 12:03 AM GMT
Next Story