Telugu Global
Family

కద్రువ " వినత (For Children)

కద్రువ-వినత ఇద్దరూ వొకరికొకరు సవతులు. ఇద్దరూ కశ్య ప్రజాపతిని పెళ్ళాడారు. ఇద్దరూ ధరణీ దక్షుల కుమార్తెలే. ఇద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు. అయితే కద్రువ అండములు పగిలి వేయి మంది పిల్లలు పాములుగా బయటకు వచ్చారు! కాని వినత అండములు పగల్లేదు. అలాగే వున్నాయి. వినత యెంతో ఆసక్తితో చాలా చాలా యెదురు చూసింది. ఎంతకీ పిల్లలు రాకపోవడంతో ఒక అండాన్ని అంటే గుడ్డుని పగులగొట్టింది. దాంతో ఆ గుడ్డులోంచి సగం తయారయి – కింది సగం తయారుకాని […]

కద్రువ-వినత ఇద్దరూ వొకరికొకరు సవతులు. ఇద్దరూ కశ్య ప్రజాపతిని పెళ్ళాడారు. ఇద్దరూ ధరణీ దక్షుల కుమార్తెలే. ఇద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు. అయితే కద్రువ అండములు పగిలి వేయి మంది పిల్లలు పాములుగా బయటకు వచ్చారు! కాని వినత అండములు పగల్లేదు. అలాగే వున్నాయి. వినత యెంతో ఆసక్తితో చాలా చాలా యెదురు చూసింది. ఎంతకీ పిల్లలు రాకపోవడంతో ఒక అండాన్ని అంటే గుడ్డుని పగులగొట్టింది. దాంతో ఆ గుడ్డులోంచి సగం తయారయి – కింది సగం తయారుకాని ఓ శిశువు వచ్చాడు. అతని శరీర నిర్మాణం పూర్తికాలేదు. కాకుండా తొందరపడి గుడ్డును పగులగొట్టినందుకు ఆ శిశువు శపించాడు. “వెయ్యేళ్ళు నీ సవతికి దాసీగా ఉండు”అని!. తరువాత వినత ఆ శిశువు మాట మేరకు రెండో గుడ్డును తాకలేదు. మొదటి గుడ్డునుండి సగం శరీరంతో వచ్చిన శిశువే అనూరుడు. సూర్యుని రథసారధి. ఇక రెండవ గుడ్డు నుండి వచ్చినవాడే గరుత్మంతుడు! కద్రువకు కలిగిన సంతానంలో శేషుడు, వాసుకి, ఐరావతము, తక్షకుడు, కర్కాటకుడు, ధనుంజయుడు, కాళియుడు, మణినాగము, పూరణుడు, పింజరకుడు, ఏలా పుత్రుడు, వామనుడు… ఇలా చాలామంది కొడుకులు కాగ జరత్కారువు కూతురు!.

కొన్నాళ్ళకు కద్రువ, వినత ఇద్దరూ విహారం చేస్తూ సముద్రతీరానికి వచ్చారు. చాలా దూరంగా ఉన్న గుర్రాన్ని చూసారు. ఎంత తెల్లగా ఉందో అంది వినత. “లేదు, ఆ గుర్రం వంటిమీద నల్లని మచ్చ నీకు కనబడ్డం లేదా? అని అంది కద్రువ. మొత్తం తెలుపని, కాదు కొంత నలుపని ఇద్దరూ వాదించుకొని పందాలు వేసుకున్నారు. గుర్రం శరీరం మీద ఏ మాత్రం నలుపు రంగు కనబడినా వినత దాసీగా ఉండేటట్టు, గుర్రం శరీరమంతా మొత్తం తెల్లగా కనిపిస్తే కద్రువ దాసీగా ఉండేటట్లు – ఒకరికొకరు దాసీ అయ్యేటట్లు పందాలు వేసుకున్నారు. అప్పటికే చీకటి పడింది. పతిసేవకు వేళయిందని, మర్నాడు చూద్దామని కద్రువ అనడంతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు!

ఆ రాత్రి కద్రువ వెయ్యిమంది పిల్లలైన పాముల్ని పిలిచింది. పందెం గురించి చెప్పింది. ఎలాగయినా తాను పందెంలో గెలవాలంది. గుర్రం వాలానికి అంటే తోకకి జుట్టుకి మీరు చుట్టుకుంటే నల్లగా కనిపిస్తుందని చెప్పింది. ఆధర్మానికి వడిగట్టలేమని చాలామంది పిల్లలు చెపుతూ ఉంటే కద్రువకు తను ఓడిపోతానని భయం వేసింది. కొడుకులని కూడా ఆ కోపంలో చూడకుండా శపించింది. “జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి నాశనమయి పోండి” అని! అప్పుడు తల్లి మాటలకు భయపడిన కర్కోటకుడనే వాడు “నేను గుర్రం తోకను చుట్టుకొని ఉంటాను” అని మాట ఇచ్చాడు. ఇచ్చినట్టే చేసాడు. మర్నాడు గుర్రాన్ని సవతులిద్దరూ దూరం నుండి చూసారు. గుర్రం తోక దగ్గర నల్లగా కనిపించడంతో వినత కద్రువకు పందెం ప్రకారం దాసీ అయింది! అప్పుడే రెండవ గుడ్డు నుండి గరుత్మంతుడు పుట్టాడు.

కుద్రువ సంతానానికి సేవలు చేయడం చాలక, వాళ్ళతో అవమానాలు పడడం చూసి తల్లి వినతను “నువ్వు దాసిగా ఎందుకుండాలి?” అని అడిగాడు. జరిగిన పందెమూ ఫలితమూ చెప్పింది వినత. తన తల్లిని బానిసత్వం నుండి విముక్తి కల్పించమని కోరాడు గరుత్మంతుడు. కద్రువ పుత్ర సర్పాలన్నీ అందుకు ప్రతిగా అమృతాన్ని కోరాయి. కోరినట్టుగానే గరుత్మంతుడు అమృతం తెచ్చిఇవ్వడంతో వినత దాసీగా విముక్తురాలైంది!

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  31 July 2015 1:02 PM GMT
Next Story