Telugu Global
Others

కొత్త విధానంతో ఏపీ-టి ఉద్యోగుల సర్దుబాటు!

ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో ఎంత మందిని తెలంగాణకు పంపిస్తే, అంతే సంఖ్యలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ‘సర్దుబాట్ల’లో భాగంగా వెనక్కు పంపిస్తుంది. దీనిని ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులూ అంగీకరించారని తెలుస్తున్నది. ఈ మేరకు ఫైలుపై తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మ ఇప్పటికే సంతకం చేయగా, సంబంధిత ఫైలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు వద్దకు వెళ్లినట్లు వినవస్తోంది. కాగా కమలనాథన్‌ కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల […]

కొత్త విధానంతో ఏపీ-టి ఉద్యోగుల సర్దుబాటు!
X
ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో ఎంత మందిని తెలంగాణకు పంపిస్తే, అంతే సంఖ్యలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ‘సర్దుబాట్ల’లో భాగంగా వెనక్కు పంపిస్తుంది. దీనిని ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులూ అంగీకరించారని తెలుస్తున్నది. ఈ మేరకు ఫైలుపై తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మ ఇప్పటికే సంతకం చేయగా, సంబంధిత ఫైలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు వద్దకు వెళ్లినట్లు వినవస్తోంది. కాగా కమలనాథన్‌ కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. మరోవైపు ఉద్యోగుల రిలీవింగ్‌ ప్రక్రియ కూడా ఊపందుకుంది. అయితే విద్యుత్‌ వంటి కొన్ని శాఖల్లో జరిగిన ఉద్యోగుల కేటాయింపులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ‘స్థానికత’ ప్రాతిపదికన ఏపీకి కేటాయించినప్పటికీ, ‘పోస్టులు లేవు’ అనే పేరిట కొందరు ఉద్యోగులను చేర్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. మరోవైపు వారిని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్‌ చేసేస్తున్నది. దీంతో ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో, తాజాగా రిలీవైన 1256 మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి స్టే తెచ్చుకున్నారు. రిలీవ్ చేసినా జీతాలు తెలంగాణ ప్ర‌భుత్వ‌మే చెల్లించాల‌ని కూడా కోర్టు నుంచి ఆదేశాలు పొందారు. ఈ నేప‌థ్యంలో ‘ఉద్యోగుల సర్దుబాటు’ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. దానికి ముందు సూపర్‌ న్యూమరీపై ఆలోచన చేసినా.. న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇరు రాష్ట్రాలూ అటు మొగ్గడానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ ‘సర్దుబాట్లు’ చేసుకోవాలని నిర్ణయిస్తే.. దానిపై ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో మీరెంత మంది ఉద్యోగుల్ని రిలీవ్ చేస్తే మేమూ అంతే మందిని రిలీవ్ చేస్తామంటూ ఉభ‌య రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఒప్పందానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇలా ఇరు రాష్ట్రాలకూ ఉద్యోగుల సర్దుబాటు దిశగా యత్నాలు జరుగుతున్నాయి.
First Published:  15 July 2015 5:55 AM GMT
Next Story