Telugu Global
Others

గోదావ‌రిలో తెలుగు సీఎంల పుణ్య పుష్క‌ర స్నానం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, తెలంగాణ‌లో క‌రీంన‌గ‌ర్ జిల్లా ధ‌ర్మ‌పురిలో ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు స‌తీస‌మేతంగా పుష్క‌ర స్నానం అచ‌రించారు. గోదావరికి 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కర పండుగ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ మంగళవారం అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. తూర్పు‌గోదావ‌రి జిల్లా జనసంద్రమైంది. యాత్రికులతో రైల్వే స్టే‌ష‌న్లు‌, ఆర్టీసీ బస్టాండ్లు, హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. పుష్క‌రాల తొలిరోజు దాదాపు పది లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు. కోటిలింగాల పుష్కర ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. […]

గోదావ‌రిలో తెలుగు సీఎంల పుణ్య పుష్క‌ర స్నానం
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, తెలంగాణ‌లో క‌రీంన‌గ‌ర్ జిల్లా ధ‌ర్మ‌పురిలో ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు స‌తీస‌మేతంగా పుష్క‌ర స్నానం అచ‌రించారు. గోదావరికి 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కర పండుగ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ మంగళవారం అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. తూర్పు‌గోదావ‌రి జిల్లా జనసంద్రమైంది. యాత్రికులతో రైల్వే స్టే‌ష‌న్లు‌, ఆర్టీసీ బస్టాండ్లు, హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. పుష్క‌రాల తొలిరోజు దాదాపు పది లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు. కోటిలింగాల పుష్కర ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా భ‌క్తులంతా ఎగిసి ప‌డ‌డంతో పోలీసులు అదుపు చేయ‌లేక పోతున్నార‌ని తెలుస్తోంది. పుష్కరాల తొలిరోజు గోదావరి ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
క‌నుల విందు చేస్తున్న రాజ‌మండ్రి
పుష్కరాలకు ఆతిథ్య‌మిస్తున్న రాజమండ్రి నగరం పుష్కరాల సంద‌ర్బంగా క‌నుల విందుగా అలంక‌రించుకుంది. ఈ వేడుకలో పాల్గొన‌డానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాత్రే రాజ‌మండ్రికి చేరుకున్నారు. పుష్కరఘాట్‌, ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో ఆయన పుష్కరాల సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. మంగ‌ళ‌వారం ఉదయం 6.26 నిముషాలకు పుష్కరఘాట్‌లో ఆయన సతీసమేతంగా పుష్కర పుణ్య స్నానం ఆచరించారు. ఆ తర్వాత జయేంద్ర సరస్వతి రాజ‌మండ్రిలోను, ఇదే సమయానికి కొవ్వూరులో విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం చేశారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.
గోదావరి పుష్కరాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా రాజమండ్రికి 19వేల మంది పోలీసులను తరలించారు. రాజమండ్రిలోని కొన్ని ప్రదేశాల్లో పూర్తిగా వాహనాలను నిషేధించడం, మరికొన్నిచోట్ల వన్‌వే మార్గాలను అమలు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి యాత్రికుల కోసం ఆరు ప్రత్యేక బస్ స్టేషన్లు, సిటీబస్‌ల కోసం ఐదు బస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాజమండ్రిలోని 10 మార్గాల్లో ప్రతీ ఐదు నిమిషాలకూ ఒక బస్సు చొప్పున 300 సిటీ షటిల్‌ సర్వీసులను నడపడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పుష్కరాలను పురస్కరించుకుని ప్రస్తుతం నడుస్తున్న 8 సాధారణ, 28 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయడంతోపాటు మరో 13 ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతంలోని రైల్వేస్టేషన్లలోని ద్వారాలను వెడల్పుచేసి ప్రతిరోజూ లక్షా 50 వేల మంది యాత్రికులు ఇక్కడకు చేరుకోవడానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. రాజమండ్రి ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారాల ఏర్పాటు చేశారు.
ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట‌
పుష్కరాల సమయంలో పరిశుభ్రత నిర్వహణ కోసం 13 వేల మంది పారిశుధ్య కార్మికులను నియమించి, యాత్రికుల సౌకర్యార్థం 1,400 మరుగుదొడ్లు, 900 దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 160 వైద్య బృందాలు నిరంతరం యాత్రికులకు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏడు ప్రత్యేక వైద్యశాలలను ఏర్పాటు చేయడంతోపాటు రెండు జిల్లాల్లోనూ ఏడు బోట్‌ అంబులెన్స్‌లను రంగంలోకి దించారు. అత్యవసర సేవల నిమిత్తం 20 బృందాలను నియమించడంతోపాటు 108 వాహనాలు 70, 104 వాహనాలు 44 సిద్ధం చేశారు. యాత్రికుల నియంత్రణకు నిఘా కెమెరాల ఏర్పాటుతోపాటు సమాచారాన్ని, ఫిర్యాదులను అందించడానికి 25 ప్రదేశాల్లో మొబైల్‌ యాప్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నగరంలోని 20 బ‌హిరంగ ప్రదేశాల్లో ఇంట‌ర్‌నెట్‌ను అనుసంధించ‌డానికి వైఫై సదుపాయాన్ని కల్పించారు. గోదావరి నదిలో ప్రతీ పది మీటర్లకు ఒక పడవను ఏర్పాటు చేసి, వాటన్నింటినీ తాడుతో కలిపి ప్రతీ పడవలోనూ ఇద్దరు గజ ఈతగాళ్లను నియమించారు. కోటిలింగాల స్నానాల ఘాట్‌లో 110 పడవలను, 220 మంది గజ ఈతగాళ్లను నియమించారు. మొత్తం మీద ఈ పుష్క‌రాల‌ను ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటోంది.
First Published:  13 July 2015 11:28 PM GMT
Next Story