Telugu Global
Others

చంద్ర‌బాబుపై పూర్తి విచార‌ణ జ‌రిపించాల్సిందే

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరీ ఇంత దిగజారుతాయనుకోలేదని సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏ ఆరోపణలైతే వచ్చాయో, వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.  ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కార్ప్స్‌ (ఐడబ్యుపిసి) న్యూఢిల్లీలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ‘ప్రస్తుత రాజకీయాలు, ఎన్నికల పొత్తులు’ అన్న అంశంపౖౖె ఏచూరి మాట్లాడారు. ఓటుకు నోటు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే ఇలాంటి కేసుల్లో దోషులను కఠినంగా […]

చంద్ర‌బాబుపై పూర్తి విచార‌ణ జ‌రిపించాల్సిందే
X
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరీ ఇంత దిగజారుతాయనుకోలేదని సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏ ఆరోపణలైతే వచ్చాయో, వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కార్ప్స్‌ (ఐడబ్యుపిసి) న్యూఢిల్లీలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ‘ప్రస్తుత రాజకీయాలు, ఎన్నికల పొత్తులు’ అన్న అంశంపౖౖె ఏచూరి మాట్లాడారు. ఓటుకు నోటు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే ఇలాంటి కేసుల్లో దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ పరిణామాలు రాజకీయాల్లో నైతిక విలువల దిగజారుడుకు అద్ధం పడుతున్నాయన్నారు. వీరికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఈ సారి లలిత్‌ మోడీ గేట్‌ కుదిపేయనుందని ఏచూరి పేర్కొన్నారు. వివిధ కేసుల్లో నేరస్తుడిగా తేలిన ఐపిఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోడీకి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా గళం వినిపించనున్నందున పార్లమెంటు వర్షాకాల సమావేశాలు స్థబించే అవకాశముందని ఆయన చెప్పారు. నేరస్తుడైన లలిత్‌ మోడీకి సుష్మా స్వరాజ్‌, వసుంధర రాజే సాయంపై అడిగిన ప్రశ్నలకు ఏచూరి సమాధానమిస్తూ దర్యాప్తు పూర్తయ్యేవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు కచ్చితంగా పదవుల్లో ఉండరాదని చెప్పారు. ‘అరోపణలన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు జరగాలి. దర్యాప్తు పూర్తయ్యేవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ప్రభుత్వ పదవుల్లో కచ్చితంగా ఉండరాదన్నారు. మోడీ ఏడాది పాలనలో ధరలు చుక్కలనంటు తున్నాయని, ప్రజలపై ఎడాపెడా భారాలు మోపుతున్నారని ఏచూరి అన్నారు. మోడీ ఏడాది కాలంలో 21 విదేశీ యాత్రలు చేశారని, వీటివల్ల దేశానికి ఒరిగిందేమీలేదన్నారు. భూ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ నివేధిక రైతులకు వ్యతిరేకంగా ఉంటుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కమిటీ నివేదిక రైతులకు అనుకూలంగా ఉంటే మద్దతిస్తామని…లేకుంటే నిలదీస్తామని చెప్పారు. భూ బిల్లుకు వ్యతిరేకంగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు సాగిస్తున్న భూమి అధికార్‌ ఆందోళనకు తమ పూర్తి మద్దతు వుంటుందని తెలిపారు. సెప్టెంబర్‌ రెండున కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను సంపూర్ణంగా బలపరుస్తున్నా మన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగష్టు 1నుంచి 14వరకు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో వెళ్తున్నారా అని అడగ్గా, నో అని సమాధానమిచ్చారు. వామపక్ష ఐక్యతతోనే ముందుకు వెళ్తా మని పేర్కొన్నారు. ఆశా, అంగన్‌వాడీ, హెల్త్‌, మద్యాహ్నా భోజన వర్కర్లుకు స్టైఫండ్‌ కాదని…జీతం ఇవ్వాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.
First Published:  1 July 2015 9:51 PM GMT
Next Story