Telugu Global
NEWS

రేపు తెలుగు సీఎంల ముఖాముఖి భేటీ?

తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఇపుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ముఖాముఖి తలపడేలా చేస్తోంది. రాష్ట్రపతి గౌరవార్థం మంగళవారం రాత్రి గవర్నర్ నరసింహన్ రాజభవన్లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను గవర్నర్‌ ఆహ్వానించారు. ఇద్దరూ కూడా ఆయన ఆహ్వానాన్ని అంగీకరించారు. తాను విందుకు వస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలియజేయగా, ఏపీ […]

రేపు తెలుగు సీఎంల ముఖాముఖి భేటీ?
X
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఇపుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ముఖాముఖి తలపడేలా చేస్తోంది. రాష్ట్రపతి గౌరవార్థం మంగళవారం రాత్రి గవర్నర్ నరసింహన్ రాజభవన్లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను గవర్నర్‌ ఆహ్వానించారు. ఇద్దరూ కూడా ఆయన ఆహ్వానాన్ని అంగీకరించారు. తాను విందుకు వస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలియజేయగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా విందుకు హాజరవుతానని మాటిచ్చారు. ఓటుకు నోటు కేసు, సెక్షన్8 అమలు తదితర అంశాల్లో ఉప్పు, నిప్పు మాదిరిగా తయారైన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరిముఖం ఒకరు నేరుగా చూసుకునే పరిస్థితి ఉన్నట్టు కనిపించటంలేదు. ఇటీవల పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాక సందర్బంగా వీరు కలిసే పరిస్థితి కలిగింది. అయితే వీరిద్దరూ ఒకరికొకరు ఎదురు పడేలా ఈ విందుకు హాజరవుతారా? లేక ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళతారా అన్న అంశంపైనే ఇపుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ విందు అవకాశాన్ని పురస్కరించుకుని ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకునే పరిస్థితి వస్తే ముఖాముఖిగా మాట్లాడుతారా లేక ముభావంగా ఉంటారా అన్నది కూడా చర్చనీయాంశమైంది. మరో 24 గంటలు గడిస్తే గాని ఈ విషయాల మీద అందరికీ స్పష్టత రాదు. లెట్స్ వెయిట్!
First Published:  29 Jun 2015 7:36 AM GMT
Next Story