Telugu Global
Family

ఎవరు పెళ్ళాడాలి?

నలుగురు స్నేహితులు దూర ప్రయాణం చేస్తూ ఒక అడవిలోకి ప్రవేశించారు. చీకటి పడింది. ఒక చెట్టు కింద పడుకున్నారు. క్రూరమృగాలు రాకుండా వంతుల ప్రకారం మేలు కున్నారు. వాళ్ళు నలుగురూ నాలుగు విద్యలు తెలిసినవాళ్ళు. బ్రాహ్మణుడు, వడ్రంగి, బట్టలు కుట్టే వ్యక్తి, స్వర్ణకారుడు. మొదట మేలుకుని వుండే వంతు వడ్రంగిది. కాంతి కోసం చిన్ని దీపం వెలిగించాడు. నిర్మల వాతావరణంలో ఏదయినా బొమ్మను చెక్కుదామని అనుకున్నాడు. దగ్గర్లో ఒక కొయ్యదుంగ కనిపిస్తే ఉలి తీసుకుని అందమైన అమ్మాయి […]

నలుగురు స్నేహితులు దూర ప్రయాణం చేస్తూ ఒక అడవిలోకి ప్రవేశించారు. చీకటి పడింది. ఒక చెట్టు కింద పడుకున్నారు. క్రూరమృగాలు రాకుండా వంతుల ప్రకారం మేలు కున్నారు. వాళ్ళు నలుగురూ నాలుగు విద్యలు తెలిసినవాళ్ళు. బ్రాహ్మణుడు, వడ్రంగి, బట్టలు కుట్టే వ్యక్తి, స్వర్ణకారుడు. మొదట మేలుకుని వుండే వంతు వడ్రంగిది. కాంతి కోసం చిన్ని దీపం వెలిగించాడు. నిర్మల వాతావరణంలో ఏదయినా బొమ్మను చెక్కుదామని అనుకున్నాడు. దగ్గర్లో ఒక కొయ్యదుంగ కనిపిస్తే ఉలి తీసుకుని అందమైన అమ్మాయి రూపంలో బొమ్మను చెక్కాడు. రెండు గంటలపాటు ఏకాగ్రతగా చెక్కాడు. తను చెక్కిన బొమ్మ సౌందర్యానికి తనే ముగ్ధుడయి పరవశించి ఆ రూపాన్నే మనసులో నిలుపుకుని పడుకున్నాడు. తరువాతి వంతు బట్టలు కుట్టే వ్యక్తిది. ఆ బొమ్మను చూసి యింత అందమైన బొమ్మకు మంచి బట్టలు వుంటే మరింత అందాన్నిస్తుందనుకుని రెండుగంటలపాటు బట్టలు కుట్టి బొమ్మను అలంకరించి సంతృప్తిగా పడుకున్నాడు. ఆ తరువాత స్వర్ణకారుడివంతు. సజీవంగా వున్న ఆ స్త్రీ విగ్రహాన్ని చూసి ఈ విగ్రహాన్ని తళతళలాడే నగలతో అలంకరిస్తే అపూర్వంగా వుంటుందనుకుని రెండు గంటలపాటు శ్రమించి నగలతో బొమ్మను అలంకరించాడు. చివరివంతు బ్రాహ్మణుడిది. అతనా విగ్రహాన్ని చూసి నిశ్చేష్టుడయి యింత అందంగా వున్న బొమ్మ నిజంగా ప్రాణం పోసుకుంటే ఎంత బావుంటుందని ఆ బొమ్మకు ప్రాణాల్నిపొయ్యమని దేవుణ్ణి ప్రార్ధించి నిద్రపోయాడు. ఉదయాన్నే నిద్రలేచేసరికి సజీవంగా తమముందు నిల్చున్న అపూర్వ సౌందర్య రాశిని చూసి నలుగురు ఆశ్చర్యపోయారు. నలుగురూ ఆ అమ్మాయిని యిష్టపడ్డారు. ఆ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటానంటే నేను చేసుకుంటానని గొడవపడ్డారు. 'మొదట చెక్కింది నేను కనక ఆమె నా భార్య' అన్నాడు వడ్రంగి. 'అమెకు బట్టలు కుట్టి నేను వెయ్యకుంటే అసహ్యమయిన బొమ్మగా మిగిలేది' అన్నాడు బట్టలు కుట్టే వ్యక్తి. 'నేను ఆభరణాలు అలంకరించినందువల్లే ఆమెకంత సౌందర్యం వచ్చింది. కనుక నేనే పెళ్ళాడాలి' అన్నాడు స్వర్ణ కారుడు. బ్రాహ్మణుడు 'నేను ప్రాణం పొయ్యకుంటే ఆమె మానవమూర్తిగా మారేది కాదు కాబట్టి నేనే పెళ్ళాడాలి' అన్నాడు. అప్పుడే దేవుడు ఒక సన్యాసి రూపంలో అటుగా వచ్చాడు. నలుగురూ తమ సమస్య చెప్పి అతన్ని పరిష్కారమడిగారు. దేవుడు 'వడ్రంగి, బ్రాహ్మణుడు ఆమెకు తండ్రితో సమానులు. కారణం వాళ్ళు ఆకారాన్ని, ప్రాణాన్ని యిచ్చారు. బట్టలు కుట్టేవ్యక్తి ఆమెకు సోదర సమానుడు. మాన సంరక్షణ చేసేవాడు సోదరుడిలాంటివాడే కదా! ఇక నగానట్రా భార్యకు కొని పెట్టేవాడు భర్తే కదా! అందుకని స్వర్ణకారుడే ఆమెకు తగిన భర్త' అన్నాడు దేవుడు. స్వర్ణకారుడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు.

First Published:  7 April 2015 8:16 PM GMT
Next Story