Telugu Global
Andhra Pradesh

కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టే నీచుడు చంద్రబాబు

జగన్‌ కుటుంబంలోనూ ఇటీవల చిచ్చు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు తన కుటుంబంలో చిచ్చు పెట్టాడని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టే నీచుడు చంద్రబాబు
X

చంద్రబాబు నాయుడు తన అధికార దాహం తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయ‌కుడు ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం ఆయన రాజకీయ జీవితంలో కొత్త కాదని, ఇప్పుడు మరింత దిగజారి కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మంగళవారం ముద్ర‌గ‌డ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలోనూ ఇటీవల చిచ్చు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు తన కుటుంబంలో చిచ్చు పెట్టాడని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నీచ రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాంటి చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాలని తపిస్తున్న పవన్‌ కల్యాణ్‌ కూడా దీనికి సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తనను వేధించిన తీరు, అవమానాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని ఆయన వాపోయారు.

మేనిఫెస్టోల విషయానికొస్తే.. జగన్‌ది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో అని, చంద్రబాబుది తన అధికార దాహం తీర్చుకునే మోసపూరిత మేనిఫెస్టో అని ముద్రగడ పద్మనాభం చెప్పారు. చంద్రబాబు నాయుడు అమలు కాని హామీలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడని ఆయన విమర్శించారు. తాను చాలామంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని ఆయన తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఆయన పాలన సాగించారని కొనియాడారు. ప్రజలకు మంచి చేసే సీఎం వైఎస్‌ జగన్‌కే మరోసారి పట్టం కట్టాలని, ఆయనకు అండగా నిలవాలని ప్రజలను కోరారు.

First Published:  7 May 2024 12:58 PM GMT
Next Story